1984 సిక్కుల ఊచకోత కేసు: న్యాయం గెలిచింది.. ఈ కాంగ్రెస్ నేతకు జీవితకాల శిక్ష
1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు జీవితకాల శిక్ష విధించింది ఢిల్లీ హైకోర్టు. సజ్జన్ కుమార్ ఈ కేసులో నిర్దోషి అని కిందికోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆయనకు జీవితకాల శిక్ష విధిస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నాడు సిక్కుల ఊచకోతకు సంబంధించి కింది కోర్టు కుట్రకోణంను విస్మరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి కెప్టెన్ భగ్మాల్, గిర్ధారి లాల్, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బల్వాన్ కోఖర్లకు కూడా హైకోర్టు జీవితకాల శిక్ష విధించింది. కిషన్ కొక్కర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్లకు 10 ఏళ్ల పాటు శిక్ష విధించింది.
కింది కోర్టు తీర్పుతో విబేధించిన ఢిల్లీ హైకోర్టు
అక్టోబర్ 31, 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీ కంటోన్మెంట్లో చెలరేగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను హత్యచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును జస్టిస్ ఎస్ మురళీధర్, వినోద్ గోయెల్ విచారణ చేసి తీర్పు వెల్లడించారు. 1984లో జరిగిన అల్లర్లను పరిశీలిస్తే మానవత్వంపై జరిగిన దాడిగా చూడాల్సి ఉందని జడ్జీలు అభిప్రాయపడ్డారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని బాధితులు గుర్తించాలని జడ్జీలు పేర్కొన్నారు. ఈ కేసులో కింది కోర్టు సజ్జన్ కుమార్ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. ఈ కేసును విచారణ చేసిన ధర్మాసనం సజ్జన్కుమార్తో పాటు మరికొందరిని దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ కేసులో సజ్జన్ కుమార్ ప్రధాని నిందితుడిగా ఉండగా అతన్నే కింది కోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సీబీఐ తప్పు బట్టింది. ఆనాడు జరిగిన అల్లర్లకు కారణం సజ్జన్ కుమారే అని గట్టిగా వాదించింది. అతను రెచ్చగొట్టడం వల్లే అల్లరిమూకలు పలువురు సిక్కులను చంపారని తన వాదనలు వినిపించింది సీబీఐ.
గాంధీ కుటుంబం మూల్యం చెల్లించుకుంటుంది: జైట్లీ
మరోవైపు అల్లర్లను అదపుచేయడంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేరు వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. రోజు వారీ డైరీని పరిశీలిస్తే అందులో ఏమీ నమోదు కాలేదని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే నాటి సిక్కు అల్లర్ల కేసులో బాధిత కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆర్థిక మంత్రి జైట్లీ వరుస ట్వీట్లు చేశారు. కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు ఆలస్యంగా అయినా సరే శిక్షపడిందని న్యాయం బతికే ఉందంటూ ట్వీట్ చేశారు జైట్లీ. 1984లో చోటుచేసుకున్న సిక్కు అల్లర్లపై కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకుంటుందని జైట్లీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో 1984 సిక్కు అల్లర్ల కేసును తొక్కి పెట్టడం జరిగిందని ఎన్డీఏ సర్కార్ చొరవతో మళ్లీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయగలిగామని మరో ట్వీట్లో పేర్కొన్నారు జైట్లీ.
నానావతి కమిషన్ నివేదిక ఆధారంగా కేసు నమోదు
2013లో కింది కోర్టు ఐదుగురిని విచారణ చేసింది. ఇందులో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బల్వాన్ కొక్కార్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్, కిషన్ కొక్కర్, గిర్ధారీలాల్, కెప్టెన్ భగ్మల్లు ఉన్నారు. వీరందరికి కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో కిందికోర్టు విచారణ చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సిక్కులు కేహార్ సింగ్, గుర్ప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్లను కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్తో పాటు మరో ఐదుగురు కలిసి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని రాజ్నగర్లో ఈ ఘటన జరిగింది. అయితే వారికి విధించిన జైలు శిక్షపై కిందికోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ మాత్రం వీరు ముందస్తు ప్రణాళిక మేరకే సిక్కులపై దాడులు చేసి హత మార్చారని కోర్టుకు తెలిపింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సీబీఐ కోర్టుకు తెలిపింది. కింది కోర్టు సజ్జన్ కుమార్ నిర్దోషి అని ప్రకటించడంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ నానావతి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2005లో సజ్జన్ కుమార్పై కేసు నమోదు చేయడం జరిగింది.