అయిదెకరాలను ఎందుకు తిరస్కరించాలి?: ముస్లింల ప్రతినిధివా?: ఒవైసీకి ముస్లిం నేత చురక
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై ముస్లిం నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విరాళంగా ఇచ్చే ఐదెకరాల భూమి వద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఒవైసీ వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ తప్పుపట్టారు. అయిదు ఎకరాల స్థలాన్ని వద్దని నిరాకరించడానికి నువ్వెవరు అంటూ సల్మాన్ నిజామి భగ్గుమన్నారు.
ఐదెకరాల భూమిని ఎందుకు తిరస్కరించాలి? 200 మిలియన్ల ముస్లింలకు ఓవైసీ ఏమైనా ప్రతినిధా? ఆ భూమిలో మసీదును తప్పుకుండా నిర్మించాలి. అంతేకాకుండా హిందూ, ముస్లింలు కలిసి చదువుకునేలా ఓ విద్యాలయాన్ని కూడా కట్టాలి. భూమిని తీసుకోవడంలో ఎవరు అసహనాన్ని వెళ్లగక్కనవసరం లేదు. సానుకూల ఆలోచన ధోరణి, శక్తితో చెడు, దుష్టశక్తులను పారదోలాలి అని సల్మాన్ నిజామీ ట్వీట్ చేశారు.
Why to reject the 5 acre land? Owaisi is not the 'thekedar' of 200+ million Muslims. We must build the 'Mosque', also an institute where both Hindus & Muslims can study together. No one shoud feel disgusted. Hatred & evil designs can be dealt only wd positive energies & thoughts!
— Salman Nizami (@SalmanNizami_) November 9, 2019
సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించాల్సిన అవసరం ప్రతి భారతీయ ముస్లింనకూ ఉందని నిజామి స్పష్టం చేశారు. ముస్లిం సమాజానికి సుప్రీంకోర్టు మోసగించలేదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమికి ప్రత్యామ్నాయంగా అయోధ్యలోనే అయిదు ఎకరాల భూమిని ఉత్తర ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తుందని, దీన్ని స్వీకరించాల్సిందేనని చెప్పారు. దీన్ని వద్దనడంలో అర్థం లేదని ఆయన ఒవైసీకి హితవు పలికారు. ఒవైసీ చేసిన ప్రకటన ఏ మాత్రం హర్షణీయం కాదని నిజామి అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని చెప్పారు. ముస్లిం సమాజానికి మీరు ప్రతినిధులా? అని ఒవైసీని ఉద్దేశించి నిజామీ నిలదీశారు. అయోధ్యలో కేంద్రం కేటాయించే అయిదెకరాల స్థలంలో మసీదును నిర్మించుకుందామని ముస్లింలకు సూచించారు. హిందువులు, ముస్లింలు సహజీవనం సాగించాల్సిన రోజులు వచ్చాయని పేర్కొన్నారు.
ఆలయాల్లో మోగే ఘంటానాదాలు, మసీదుల్లో వినిపించే అజాన్ లను సమంగా స్వీకరించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని నిజామి తేల్చి చెప్పారు. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలకు అవకాశమే లేదని అన్నారు. ధ్వేష భావాన్ని విడనాడాలని సూచించారు.