రైతులకు లిక్కర్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. రాకేశ్ టికాయిత్,బీజేపీ రియాక్షన్ ఇదీ...
దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి హర్యానా కాంగ్రెస్ నేత విద్యా రాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రైతు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలంటే ప్రతీ ఒక్కరూ తమవంతుగా వారికి సహాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. 'డబ్బులు,కూరగాయలు,నెయ్యి... మద్యం అయినా పర్లేదు... మీకు తోచింది వారికి ఇవ్వండి..' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు లిక్కర్ ఇవ్వమని ఆమె పిలుపునివ్వడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
కాంగ్రెస్ నేత విద్యారాణి వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. 'మాకిక్కడ లిక్కర్తో ఏం పని... ఆమె ఎందుకిలా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివాళ్లు రైతు ఉద్యమానికి ఏమీ చేయనక్కర్లేదు. ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీరు చేసే ఉద్యమాల్లో ఏవైనా పంపిణీ చేసుకోండి..' అని టికాయిత్ పేర్కొన్నారు.
విద్యా రాణి వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. 'రైతు ఉద్యమాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావించడం సిగ్గుచేటు. అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారు. రైతులను వారు కేవలం ఓటు బ్యాంకుగా,పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నారు.' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రులు హర్షవర్దన్,హర్దీప్ సింగ్ పురి కూడా విద్యారాణి వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతుల ఆందోళనల పట్ల కాంగ్రెస్ అసలు ఉద్దేశం ఏంటో విద్యారాణి వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు వ్యవహారమని విమర్శించారు.
కాగా,గత 80 రోజులకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోని సింఘూ,టిక్రీ,ఘాజీపూర్ల వద్ద రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాక తాము అక్కడినుంచి కదిలేది లేదని వారు చెప్తున్నారు. కేంద్రం ఆ చట్టాలను ఏడాదిన్నర పాటు తాత్కాలికంగా పక్కనపెట్టేందుకు ముందుకు రాగా... రైతులు అందుకు ఒప్పుకోలేదు. చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండా అని ముందునుంచి చెప్తున్నారు. అది జరిగేంతవరకూ ఢిల్లీ బోర్డర్లను ఖాళీ చేసేది లేదని... ఇంటికి వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు.