సంకీర్ణ ప్రభుత్వాన్ని సిద్దరామయ్య కూల్చేస్తారు, మాజీ ప్రధాని ఫ్యామిలీ మీద 40 ఏళ్ల పగ: అశోక్ !
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభ్వుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూల్చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్. అశోక్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చెయ్యడం లేదని అన్నారు.
మాజీ సీఎం సిద్దరామయ్యకు మొదటి నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులను చూస్తే కాదని ఆర్ అశోక్ ఆరోపించారు. మాజీ ప్రధాని దేవేగౌడ మీద సిద్దరామయ్యకు 40 ఏళ్లుగా ద్వేషం ఉందని, ఆ పగను ఇప్పుడు తీర్చుకుంటున్నారని ఆర్. అశోక్ ఆరోపించారు.
దేవేగౌడ మీద ఉన్న ద్వేశాన్ని సిద్దరామయ్య ఎప్పుడు తీర్చుకుంటారో తమకే తెలీదని, ఆ విషయం సిద్దరామయ్యకు మాత్రమే తెలుసని ఆర్ అశోక్ అన్నారు. తాను సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ లాగా నిమ్మకాయలు చేతిలో పట్టుకుని తిరగడం లేదని ఆర్ అశోక్ వ్యంగంగా అన్నారు.
సిద్దరామయ్యను జేడీఎస్ నుంచి బయటకు గెంటేశారని, ఆ విషయాన్ని ఆయన ఇంకా మరిచిపోలేదని ఆర్ అశోక్ అన్నారు. ఇంత కాలం మనసులో దాచుకున్న పగను సిద్దరామయ్య ఇప్పుడు తీర్చుకోవాలని భావించారని బీజేపీ నేత ఆర్ అశోక్ ఆరోపించారు.