కాంగ్రెస్ కు సినిమా: ఆపరేషన్ కమలతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం? ఢిల్లీలో డీల్!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ సినిమా చూపిస్తోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆ రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో బీజేపీ మరోసారి ఆపరేషన్ కమలకు తెర తీస్తోందని, ఢిల్లీలో డీల్ చేస్తోందని హడలిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల మాత్రం బీజేపీ ఎక్కడ ఎమ్మెల్యేలకు వల వేస్తుందో అంటూ ఆందోళన చెందుతున్నారు.
అసంతృప్తి ఎమ్మెల్యేలు
మంత్రి మండలి విస్తరణ త్వరగా చేపట్టండి లేదంటే ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీసీసీకి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీసీసీని హెచ్చరించారు.
నిజమే అంటున్న కేపీసీసీ
ఈ విషయంపై కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే మీడియాతో మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు మాట్లాడారని తమ దగ్గర సమాచారం ఉందని అన్నారు. బీజేపీ సంప్రధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వివరాలు చెప్పడానికి ఈశ్వర్ ఖండ్రే నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని ఈశ్వర్ ఖండ్రే జోస్యం చెప్పారు.
బీజేపీ ప్లాన్ వేసింది
ఆపరేషన్ కమల విషయంలో కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్, కర్ణాటక మంత్రి (కాంగ్రెస్) డీకే. శివకుమార్ స్పంధించారు. బీజేపీ నాయకులు మళ్లీ ఆపరేషన్ కమల చేపట్టారని, సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్లాన్ వేశారని సమాచారం వచ్చిందని అన్నారు.
ఢిల్లీలో బీజేపీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు !
ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్తి ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చలు జరిపారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారని సమాచారం. ఈ విషయంపై బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ తాను అత్యవసర సమావేశంలో పాల్గొనడానికి బుధవారం ఢిల్లీ వెళ్లానని, ఆపరేషన్ కమలకు కాదని క్లారిటీ ఇచ్చారు.
మంత్రి నేతృత్వంలో రెబల్స్ ?
కర్ణాటక మంత్రి రమేష్ జారకిహోళెతో కలిసి కొందరు ఎమ్మెల్యేలు కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. పేరుకు మంత్రి వెంట ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే సమయంలో యడ్యూరప్ప అత్యవసరంగా ఢిల్లీ వెళ్లారు. ఈ విషయంపై మంత్రి రమేష్ జారకిహోళె మీడియాతో మాట్లాడుతూ తాము బీజేపీకి చెందిన ఏ నాయకుడితో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ వేణుగోపాల్ ఇంటిలో తాము ఉన్నామని మంత్రి రమేష్ జారకిహోళె స్పష్టం చేశారు. మొత్తం మీద కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఆపరేషన్ కమల భయం పట్టుకునింది.