అధ్యక్ష ఎన్నికల వేళ.. కాంగ్రెస్లో రాజీనామాల పర్వం - ఒకేసారి ముగ్గురు: సోనియాకు లేఖ
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇక గాంధీయేతర కుటుంబ నేత చేతుల్లోకి వెళ్లడం ఖాయమైంది. కాంగ్రెస్లో ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడానికి ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మల్లికార్జున ఖర్గె, శశిథరూర్ బరిలో నిలిచారు. జార్ఖండ్కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ.. అది తిరస్కరణకు గురైంది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి మల్లికార్జున ఖర్గె, శశిథరూర్ మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. వారిద్దరూ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే తాము ఏం చేస్తామనేది.. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారనే విషయాలను ప్రచార అజెండగా మార్చుకున్నారు. శశిథరూర్ తన మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్కు ముగ్గురు అధికార ప్రతినిధులు రాజీనామా చేశారు. దీపేందర్ హుడా, సయ్యద్ నాజర్ హుస్సేన్, గౌరవ్ వల్లభ్ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వారు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గె గెలవడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలను తాము చేపట్టాల్సి ఉందని, ఆ కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
దేశ రాజధానిలో నిర్వహించిన విలేకరుల సమావేశాలో వారు మల్లికార్జున ఖర్గెతో కలిసి మాట్లాడారు. ఖర్గె తరఫున తాము అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని, అధ్యక్ష పదవి ఎన్నికలు స్వేచ్ఛగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ నిబంధనకు కట్టుబడి ఉన్నామని దీపేందర్ హుడా చెప్పారు.
పార్టీ అధికార ప్రతినిధులుగా కొనసాగుతూ మల్లికార్జున ఖర్గె తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టకూడదనేది పార్టీ నిబంధన అని గుర్తు చేశారు. ఈ నిబంధన కింద తాను ఇప్పటికే తన రాజ్యసభాపక్ష పదవికి రాజీనామా చేశానని మల్లికార్జున ఖర్గె చెప్పారు. దశలవారీగా అన్ని రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని, దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణులు తనను అండగా ఉంటాయని ఖర్గె వ్యాఖ్యానించారు.