రాహుల్పై విమర్శలు: జయంతిపై దుమ్మెత్తి పోసిన నేతలు
న్యూఢిల్లీ: పార్టీని వీడుతూ మాజీ కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ చేసిన విమర్శల నేపథ్యంలో కాంగ్రెసు నేతలు తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అండగా నిలిచారు. జయంతి నటరాజన్పై వారు దుమ్మెత్తి పోశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ పనుల్లో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారనే ఆరోపణ సత్యదూరమని, దురుద్దేశాలతో చేసిన విమర్శలని వారన్నారు.
జయంతీ నటరాజన్ చేసిన విమర్శలు నిరాధారమైనవే కాకుండా అసంబద్ధమైనవని జైరాం రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తన మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో జోక్యం చేసుకోలేదని, ఇది చేయాలనీ అది చేయకూడదనీ చెప్పలేదని ఆయన అన్నారు. మంత్రిత్వ శాఖ వ్యవహారాల్లో రాహుల్ గాంధీ ఏ రోజు కూడా జోక్యం చేసుకోలేదని మరో మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.
రాహుల్ గాంధీకి గానీ సోనియా గాంధీకి గానీ అధికార కాంక్ష లేదని, అందుకే వారు పదవులకు దూరంగా ఉన్నారని ఆయన బెంగళూరులో మీడియాతో అన్నారు. సోనియా గాంధీ మూడు సార్లు ప్రధాని అయి ఉండేవారని, రాహుల్ ఏ సమయంలోనైనా ప్రధాని అయి ఉండేవారని, అయినా వారిద్దరు పదవులకు దూరంగా ఉండిపోయారని ఆయన అన్నారు
రాహుల్ గాంధీపై దురుద్దేశంతోనే జయంతీ నటరాజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. పలు అవకాశాలు వచ్చినప్పటికీ గత ఏడాది కాలంగా పార్టీలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. అవకాశాలను వాడుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. రాజీనామా చేసినవారిని ఎవరినీ కాంగ్రెసు ఆపబోదని, జయంతి కూడా కృష్ణతీర్థ బాట పట్టవచ్చునని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ గానీ సోనియా గాంధీ ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని మరో నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అలా చేయదలుచుకుంటే వారు మంత్రులుగా, ప్రధాన మంత్రులుగా అయి ఉండేవారని ఆయన అన్నారు. ఇత కాలం తర్వాత వాటిని జయంతి నటరాజన్ ఎలా గుర్తు పెట్టుకోగలిగారని ఆయన అన్నారు.