తాజా పరిణామాలపై కలత చెందిన సోనియా గాంధీ: చివరకు ఏం చెప్పారంటే..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలతో తాను తీవ్ర వేదనకు గురైనట్లు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల పట్ల సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జరిగిందేదో జరిగింది..
తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మరోసారి నియమితులైన సందర్భంగా సమావేశ ముగింపు సందేశం ఇచ్చారు సోనియా గాంధీ. తాజాగా జరిగిన పరిణామాలు తనను కొంత ఆవేదనకు గురిచేశాయన్నారు. అయితే, జరిగినదాంట్లో కుట్రలు, దుష్ట ఆలోచనలు లేవని అన్నారు. జరిగిందేదో జరిగింది.. ఇక అంతా కలిసి పనిచేద్దామని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
అప్పటి వరకు సోనియానే సారథి..
కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించేందుకు సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఆ దిశగా ఈ భేటీలో ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, కొత్త సారథిని నియమించుకునేందుకు ఆరు నెలల గడువును నిర్దేశించుకున్నారు.
Recommended Video
సోనియాను ప్రతిపాదించిన మన్మోహన్
కాగా, ఈ సమావేశంలో ఏ పార్టీ నాయకుడు కూడా గాంధీల నాయకత్వాన్ని వ్యతిరేకించనట్లుగానే తెలిసింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్నిక జరగనట్లయితే సోనియా గాంధీనే తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. మరికొందరు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధినేతగా చూడాలని డిమాండ్ చేశారు. అయితే, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలపై ఆసక్తి కనబర్చకోవడంతో తిరిగి సోనియా గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించారు. కాగా, గులాం నబీ ఆజాద్, శశిథరూర్, ఆనంద్ శర్మ లాంటి సుమారు 20 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పును కోరుతూ లేఖ రాయడంతో ఈ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సమావేశం అర్థవంతంగా జరిగిందని, కాంగ్రెస్ పార్టీని సోనియా నడిపించడం అనేది సరైన నిర్ణయమేనని అన్నారు.