దుష్యంత్..మరో కుమారస్వామి: హర్యానాలో కర్ణాటక ఫార్ములా: డిప్యూటీ సీఎం కోసం షరతులు..సోనియా సంకేతం..
చండీగఢ్: హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తోంది. భారతీయ జనతాపార్టీ కంటే ఓ అడుగు ముందే ఉంటోంది. కర్ణాటక తరహా ఫార్ములాను అనుసరించాలని నిర్ణయించుకుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాతో మాట్లాడారు. స్వేచ్ఛగా నిర్ణయాలను తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాల్సిందేనని, దీనికోసం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా తాము అంగీకరిస్తామని వెల్లడించారు.
హర్యానా అసెంబ్లీ తాళం చెవి మావద్దే.. సీఎం పదవి ఇస్తేనే.. కింగ్ మేకర్గా దుశ్యంత్ చౌతాలా
కర్ణాటక ఫార్ములాతో ప్రభుత్వ ఏర్పాటు..
కర్ణాటకలో అనుసరించిన ఫార్ములా తరహాలోనే హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి అధికారాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ.. జనతాదళ్ (సెక్యులర్)కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన విషయం తెలిసిందే. అదే తరహా వ్యూహాన్ని హర్యానాలోనూ ఆ పార్టీ అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నట్టుగానే.. హర్యానాలోనూ జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)కి సీఎం స్థానాన్ని అప్పగించడానికి సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలను పంపించింది.
అక్కడ కుమారస్వామి.. ఇక్కడ దుష్యంత్ చౌతాలా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించగలిగింది జేడీఎస్. ఆ పార్టీ చీఫ్ హెచ్ డీ కుమారస్వామి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కాంగ్రెస్ కు ఇచ్చారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎక్కువ కాలం పాటు నిలబడలేదు. బీజేపీ నాయకులు చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. సరిగ్గా 14 నెలల తరువాత సర్కార్ స్థానంలో బీజేపీ అధికారాన్ని అందుకోగలిగింది. అది వేరే విషయం.
దుష్యంత్ చౌతాలా ఇంటికి భూపీందర్ సింగ్ హుడా
కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా జేజేపీ అధినేత దుష్యంత్ సింగ్ ను ఒప్పించడానికి భూపీందర్ సింగ్ హుడా బరిలో దిగారు. ఆయన నేరుగా దుష్యంత్ చౌతాలా నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఆయన దుష్యంత్ చౌతాలాతో సమావేశమౌతారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బేషరతుగా మద్దతు ఇస్తామని కూడా సోనియా గాంధీ వెల్లడించారని భూపీందర్ సింగ్ చెబుతున్నారు. కర్ణాటక తరహాలో హర్యానాలో జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
దుష్యంత్ సింగ్ ను ఒప్పించగలిగితే..
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దూత భూపీందర్ సింగ్ హుడా.. దుష్యంత్ చౌతాలాను అంగీకరించగలిగితే.. హర్యానాలో కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమౌతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం అందుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జేజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది, ఉప ముఖ్యమంత్రి వంటి మంత్రివర్గంలోని కీలక పదవులను సమానంగా పంచుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇది ఎంతవరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.