వాట్ నెక్ట్స్: మహా ట్విస్ట్పై పార్లమెంట్లో నిరసన, సోనియాగాంధీతో పార్టీ నేతల భేటీ
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు సరికాదని సుప్రీంకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు అధినేత్రి సోనియాగాంధీ దిశానిర్దేశం చేయబోతున్నారు. లోక్సభ, రాజ్యసభలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని తమ పార్టీ ఎంపీలకు సోనియాగాంధీ స్పష్టంచేస్తారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు సోనియాతో పార్టీ నేతలు సమావేశమవుతారు.
సోనియాతో భేటీ
ఢిల్లీలోని 10 జన్పథ్లో సోనియాగాంధీతో పార్టీ నేతలు సమావేశమవుతారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. శనివారం గవర్నర్ను కలువబోతామని సంకేతాలు ఇవ్వగా.. భగత్సింగ్ కోషియారి మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
క్యాబినెట్ ఆమోదమేదీ..?
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తేశారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా హడావిడిగా ఎత్తివేయాల్సిన అవసరం ఏముందని అడిగింది. ఇంత తొందరగా మెజార్టీ లేని ప్రభుత్వానికి ఎలా అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శనివారం గవర్నర్ తీసుకున్న చర్య దేశచరిత్రలో చీకటి రోజు అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
చీకటి రోజు
పార్లమెంట్తోపాటు బయట కూడా తమ ఆందోళనను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతామని చెబుతుంది. మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్స్ను కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లిఖార్చున ఖర్గే, కేసీ వేణుగోపాల్.. ఎప్పటికప్పుడు సోనియాగాంధీకి తెలియజేస్తున్నారు.
ఉత్కంఠ
మహారాష్ట్రలో శనివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఫడ్నవీస్, అజిత్కు నోటీసులు జారీచేసి.. సోమవారం ఉదయానికి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.