కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందంటే .. రాందేబ్ బాబా చెప్పిన రహస్యమిదీ ..
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టికెట్ల కేటాయింపు .. తదితర అంశాలు ఉంటాయి. కానీ యోగా గురువు రాందేవ్ బాబా మాత్రం విచిత్ర వాదనను తెరపైకి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదైనశైలిలో సమాధానం చెప్పారు.
యోగాతో యోగం ..
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో యోగా దినోత్సవం జరుగుతున్న వేళ .. రాం దేవ్ బాబా ఆసక్తికర కామెంట్లు చేశారు. యోగా చేస్తే మీకు మంచి జరగుతుందని కొత్త భాష్యం చెప్తున్నారు. యోగా చేసే ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీపై మాత్రం విమర్శల జడివాన కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదో వివరించారు. రాహుల్గాంధీ ఎప్పుడూ యోగ చేయలేదు. అందుకే ఆయన పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని పేర్కొన్నారు.
అంతలోనే మారిన మాట ..
రాహుల్ యోగ చేయడం లేదని .. మోడీ మాత్రం ప్రజలతో కలిసి యోగా చేస్తున్నారని గుర్తుచేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా తమ ఇంటిలో యోగా చేసేవారని గుర్తుచేశారు. కానీ వారి వారసుడు రాహుల్ మాత్రం యోగం చేయడం లేదని .. అందుకే అతనికి విజయం దక్కడం లేదని కుటుంబ నేతల విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాదు యోగా చేసేవారికి శారీరకంగా, మానసికంగా కాదు .. రాజయోగం పడుతుందని సెలవిచ్చారు రాందేవ్ బాబా. అయితే ఏడాదిక్రితం ఓ టీవీ ఇంటర్వ్యూలో మాత్రం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రతిరోజు యోగా చేస్తారని చెప్పారు. రాహుల్ తనతో కలిసి యోగా చేస్తారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతలోనే రాహుల్ యోగ చేయడం లేదని కామెంట్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
మోడీ-నెహ్రూ అదరహో ..
ప్రధాని మోడీ యోగా చేస్తారు. గతేడాది తన నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్లో యోగా చేసి రెండు నిమిషాల నిడివి గల వీడియోను మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది తన ఆరోగ్య రహస్యమని సంకేతాలను ఇచ్చారు మోడీ. కొందరు నెటిజన్లు మోడీ, నెహ్రూ ఫిట్నెస్ యోగా అని కూడా ట్రోల్ చేశారు. చాలామంది నెహ్రూ వేసిన శిర్షాసనం ఫోటోను షేర్ చేశారు. ఇందిరాగాంధీ కూడా యోగ చేసేవారు. మరో రెండు రోజుల్లో జరిగే యోగా డే నాడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి యోగా చేయనున్నారు రాందేవ్ బాబా. నాందేడ్లో జరిగే వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.