అధికారంలోకి వస్తే ఎన్నికల సంస్కరణలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరిస్తామన్న కాంగ్రెస్
ఢిల్లీ : అధికారం తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే పార్టీ మేనిఫెస్టోలో అన్నిరంగాలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి వస్తే ఎన్నికల సంస్కరణలు చేపడతామని స్పష్టం చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడంతో పాటు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తామని మాట ఇచ్చింది.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంతా ఉత్తిదే : ప్రధాని మోదీ
ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణ
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించేలా చట్టంలో మార్పులు చేస్తామని చెప్పింది. ఈ చట్టం కింద అనర్హులుగా గుర్తించిన వారు ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిబంధనలు రూపొందిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో పాటు అనర్హతకు గురైన వారు రెండేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్ట సవరణ చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది.
ఎలక్టోరల్ బాండ్ల రద్దు
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల స్థానంలో నేషనల్ ఎలక్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఎన్నికల సమయంలో ఈ నిధులను పార్టీలవారీగా పంచేలా నిబంధనలు రూపొందిస్తామని స్పష్టంచేసింది. ఎలక్టోరల్ బాండ్లు రద్దుచేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేసింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బాండ్లను రద్దుచేస్తామని ప్రకటించింది.
బ్లాక్ మనీ నిరోధానికి కృషి
బ్లాక్మనీ కారణంగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అందుకే ఎన్నికల్లో నల్లధనం ఉపయోగించకుండా ఉక్కుపాదం మోపుతామని ప్రకటించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను ట్యాంపర్ ఫ్రూఫ్గా మార్చడంతో పాటు 50శాతం వీవీప్యాట్ స్లిప్లు లెక్కించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పార్లమెంటులో బిల్లులు పెట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతో పాటు సంక్షేమ పథకాలన్నింటికీ సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది.