2022 ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ సీఎం మంతనాలు: అంతా సిద్ధమే
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను పంజాబ్ కాంగ్రెస్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు తెలిసింది.
ప్రశాంత్ కిషోర్తో పంజాబ్ సీఎం మంతనాలు
ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని పంజాబ్ కాంగ్రస్ భావిస్తోంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చోవాలని సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయించినట్లు సమాచారం. మేనిఫెస్టో తయారీ, అభ్యర్థుల ఎంపిక, పథకాల రూపకల్పన వంటి అంశాలపై చర్చించాలని ప్రణాళికలు రచించారు.
మరో 15 నెలలే ఎన్నికలకు గడువు ఉండటంతో..
117 అసెంబ్లీ స్థానాలు గల పంజాబ్ అసెంబ్లీ గడువు మరో 15 నెలల్లో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంబించాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో దశాబ్దాలుగా మిత్ర పార్టీగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి దూరమైంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ మేరకు నిర్ణయించింది.
శిరోమణి అకాలీదళ్ కోసం ప్రయత్నాలు..
ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో మరిన్ని స్థానాలు గెలుచుకోవచ్చనే ఆలోచనలో ఉంది. ఇందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల సాయం అవసరమని కాంగ్రెస్ భావించి ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
పంజాబ్ కాంగ్రెస్తో పనిచేసేందుకు ప్రశాంత్ సానుకూలం..
ప్రశాంత్ కిషోర్ కూడా పంజాబ్ కాంగ్రెస్ పార్టీతో పనిచేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో పార్టీలను గెలిపించిన విషయం తెలిసిందే. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ తోనూ ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు కోసం కూడా ఈయన పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోసం పనిచేయనున్నారు.