రాజీనామా చెయ్యలేమని తేల్చిచెప్పిన మంత్రులు, కాంగ్రెస్ లో అసమ్మతి: పాపం సిద్దూ !
బెంగళూరు: కర్ణాటకలోని పలువురు మంత్రులను వారి పదవుల నుంచి తప్పించి అపమ్మతి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తాము రాజీనామా చెయ్యమని, కావాలంటే వేరే మంత్రులను తప్పించండని కొందరు మంత్రులు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. గురువారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో కొందరు మంత్రులు ఇలా చెప్పారని తెలిసింది.
నాయకుల ప్రయత్నాలు
సీనియర్ మంత్రులను పదవుల నుంచి తప్పించి అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించాలని నేతలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి మరింత ముదిరిపోయే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. సీనియర్ మంత్రులను పదువుల నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు మొత్తం వృధా అయ్యిందని తెలిసింది.
అవకాశం లేదు
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి ఉప ఎన్నికలు, బడ్జెట్, లోక్ సభ ఎన్నికలు తదితర పనులతో సమయం గడిచిపోయిందని, తాము మంత్రులుగా పని చేసే అవకాశం లేకపోయిందని, ఇఫ్పుడు వచ్చి తమ పదవులకు రాజీనామా చెయ్యాలని చెప్పడం ఏమిటని కొందరు మంత్రులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం పూర్తి అయినా తాము మంత్రులుగా పని చెయ్యలేకపోయామని సీనియర్ నేతలు వాపోయారని సమాచారం.
సీనియర్లకు చెక్
సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా పని చేసిన వారు నేడు మంత్రులుగా ఉన్నారు. సిద్దరామయ్య సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్న కృష్ణభైరేగౌడ, జార్జ్ ఫర్నాండజ్, యుటి. ఖాదర్, దేశ్ పాండ్ తదితరులను మంత్రి పదువుల నుంచి తప్పించి అసమ్మతి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని, తమను రాజీనామా చెయ్యాలని అంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని మంత్రులు వెంకటరమణప్ప, తుకారాం, పుట్టరంగశెట్టి తదితరులు హెచ్చరించారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మంత్రి వర్గ విస్తరణ ?
మంత్రుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చెయ్యమని తేల్చి చెప్పారు. అయితే మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఉంటుందని, త్వరలో పూర్తి వివరాలు చెబుతామని మాజీ సీఎం సిద్దరాయయ్య వివరించారు.
రాజీనామ చెయ్యరు
కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకి హోళి తన పదవికి రాజీనామా చెయ్యరని, ఆయనతో చర్చలు జరుపుతున్నామని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ నోటీసులు జారీ చేశారని, సమాధానం ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని మాజీ సీఎం సిద్దరామయ్య చెప్పారు.