యడ్యూరప్ప పని గోవిందా..గోవింద! ప్యాంటు, షర్టు జేబులు కత్తిరిస్తారు: డీకేశి సంచలనం!
బెంగళూరు: కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ సారథ్యంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వ మనుగడపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో.. ఎవరికి తెలుసు? అని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని మాత్రం తాను అనుకోవట్లేదని అన్నారు. ఎప్పుడు? ఎవరు? ఏదైనా చేయొచ్చని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను నమ్ముకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, వారిని నమ్ముకుంటే ఆ పార్టీ నట్టేట మునుగుతుందని అన్నారు.
గురువారం ఉదయం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదరించి, అన్నం పెట్టిన సొంత పార్టీ చేతినే తెగ నరికారని డీకే శివకుమార్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు. పెంచి, పోషించిన సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. బీజేపీ ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా వదిలి పెడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ఇప్పుడు తిరుగుబాటు లేవనెత్తిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోనూ కుంపట్లు పెడతారని అన్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ 30-40 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగారని, కనీసం ఆ కృతజ్ఞత కూడా చూపకుండా ప్రభుత్వం పడిపోవడానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. వారిపై అనర్హత వేటు వేయాలని తాను ఇదివరకే స్పీకర్ రమేష్కుమార్కు విజ్ఞప్తి చేశానని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులను ఆశిస్తున్నారని, వారిని నియంత్రించగల సత్తా అమిత్ షాకు లేదని డీకేశి తేల్చి చెప్పారు. వారిది దొంగబుద్ధి అని ఎద్దేవా చేశారు. రెబెల్స్లో ఒక్క మహేష్ కుమటళ్లి మాత్రమే పశ్చాత్తాప పడుతున్నట్లు తెలిసిందని అన్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి తిరుగుబాటు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం యడ్యూరప్పకు కంటి మీద కునకు లేకుండా చేయడం ఖాయమని అన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఆయనను హింసిస్తారని డీకేశి చెప్పారు. యడ్యూరప్ప పని గోవిందా.. గోవిందా! అని ఎద్దేవా చేశారు. ఒకరు ప్యాంటు జేబు, ఇంకొకరు షర్టు జేబు కత్తిరించి పారేస్తారని చురకలు అంటించారు. ఓ స్నేహితునిగా తాను యడ్యూరప్పను ముందే హెచ్చరిస్తున్నానని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను నమ్ముకోవద్దని పదే పదే సూచిస్తున్నానని చెప్పారు.