ఎమ్మెల్యేల రహస్య చర్చలు: తెర మీదకు ఆపరేషన్ కమల, సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తిరుగుబాటు చెయ్యడంతో అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు మొదలైయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, మరో ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి రహస్యంగా చర్చించడంతో ఆపరేషన్ కమల తెర మీదకు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడానికి ఒంటికాలి మీద నిలబడిన ఎమ్మెల్యే రమేష్ జారకిహోళితో అదే పార్టీ ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి చర్చలు జరిపారు. రమేష్ జారకిహోళికి సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ కుమటళ్ళి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని సమాచారం.
మహేష్ కుమటళ్ళి రమేష్ జారకిహోళికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన తరువాత రమేష్ జారకిహోళి తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో ముంబైలోని హోటల్ లో మకాం వేశారు. ఆ సమయంలో రమేష్ జారకిహోళి వెంట ఉన్న ఎమ్మెల్యేలలో మహేష్ కుమటళ్ళి కూడా ఉన్నారు.
రమేష్ జారకిహోళితో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు విదేశాలకు వెళ్లడానికి సిద్దం అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి విదేశాలకు వెళ్లడానికి తన దగ్గర పాస్ పోర్టు లేదని అన్నారు. తమ ప్రాంతాలకు కృష్ణా నది నీటిని ఎలా తీసుకురావాలి అని రమేష్ జారకిహోళితో చర్చించానని మహేష్ కుమటళ్ళి అన్నారు. రమేష్ జారకిహోళి, మహేష్ కుమటళ్ళి చర్చలు ఆపరేషన్ కమలలో భాగం అని చర్చ మొదలైయ్యింది.