లింగ, పవర్ చిత్రాల సమర్పకుడు, ఎంఎల్ఏ మునిరత్న బిల్లింగ్ స్కాం
బెంగళూరు: అభివృద్ది పనుల కోసం కేటాయించిన నిధులలో గోల్ మాల్ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శాసన సభ్యుడి మీద లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ మునిరత్న అలియాస్ మునిరత్న నాయుడు మీద కేసు నమోదు చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ, మాస్ మహారాజ రవితేజ నటించిన పవర్ చిత్రాలను మునిరత్న సమర్పించగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. మొదట బీబీఎంపీ కార్పొరేటర్ అయిన మునిరత్న తరువాత ఎంఎల్ఏ అయ్యాడు. ఈయన సివిల్ కాంట్రాకర్.
సీఎం ఫండ్ నుండి రాజరాజేశ్వరినగర శాసన సభ నియోజక వర్గం అభివృద్ది పనుల కోసం రూ. 45 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. పనుల కోసం కేటాయించిన నిధులలో రూ. 10 కోట్లు గోల్ మాల్ చేశారని, నకిలి బిల్లులు సృష్టించారని ఆరోపిస్తు లోకాయుక్త పోలీసు అధికారులు సుమోటో కేసు నమోదు చేశారు.
మునిరత్నకు సంబంధించిన ఇంటిలో బీబీఎంపీ ఫైల్స్ పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులను ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉండే ఫైల్స్ ప్రయివేటు వ్యక్తి ఇంటిలో ఎలా ఉన్నాయని లోకాయుక్త ఎస్పీ సానియా నారంగ్ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ బిల్లుల స్కాంలో ఎంఎల్ఏ మునిరత్న మీద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో బీబీఎంపీ ఇంజనీరు ఎన్. విజయ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేసి జైలుకు పంపించారు. మునిరత్న మీద ఆరోపణలు రుజువు అయితే ఎప్పుడైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.