లగ్జరీ కారులో రాష్ డ్రైవింగ్తో ఎమ్మెల్యే కొడుకు రచ్చ.. జైలుకెళ్లి వచ్చినా ఏం మారలేదు..
అతనో ఎమ్మెల్యే కొడుకు. గతంలో పబ్లో తప్ప తాగి ఒకరిపై దాడి చేశాడు. ఫలితంగా జైలుకెళ్లాడు. ఇటీవలే బెయిల్పై విడుదలైన అతను... కొద్దిరోజులకే మరో కేసులో బుక్కయ్యాడు. జైలు నుంచి బయటకొచ్చాక.. తన లగ్జరీ బెంట్లీ కారులో రయ్యిమని దూసుకెళ్తూ... రోడ్డు పక్కనున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు గాయాలపాలయ్యారు. జైలుకెళ్లి వచ్చినా అతని బుద్ది మారలేదని.. అతన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరా వ్యక్తి..
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ హారీస్ కుమారుడు మహమ్మద్ నలపాడ్ 2018లో పబ్లో మద్యం మత్తులో ఒకరిపై దాడి చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు. ఇదే క్రమంలో ఆదివారం తన బెంట్లీ లగ్జరీ కారులో బయటకు వెళ్లాడు. బళ్లారి రోడ్లపై రయ్యిమని దూసుకెళ్లిన అతను.. రోడ్డు పక్కనున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన డ్రైవర్
ప్రమాదం అనంతరం వెంటనే కారు దిగిన నలపాడ్.. ఓ స్నేహితుడి బైక్పై అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డ వ్యక్తులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే బాలకృష్ణ అనే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. బెంట్లీ కారును తానే డ్రైవ్ చేశానని, ప్రమాదానికి తానే కారణమని చెప్పాడు.
డ్రైవ్ చేసిందే నలపాడ్ అంటున్న స్థానికులు
ప్రత్యక్ష సాక్షుల వాదన మాత్రం మరోలా ఉంది. యాక్సిడెంట్ సమయంలో కారు డ్రైవ్ చేసింది నలపాడ్ అని వారు చెబుతున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అతని డ్రైవర్ను స్టేషన్కు పంపించి లొంగిపోయేలా చేశాడంటున్నారు. బీజేపీ ప్రతినిధి ఎస్.ప్రకాశ్ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. నలపాడ్పై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. అంతేకాదు,అతని బెయిల్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నలపాడ్ వివాదాస్పద వ్యక్తి అని, అటువంటి వ్యక్తి సమాజానికి హానికరం అని అన్నారు.
జైలుకెళ్లి వచ్చినా మారలేదు..
2018లో పబ్ దాడి ఘటన విషయంలో నలపాడ్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిపై దాడికి పాల్పడటం అప్పట్లో పెద్ద వివాదమైంది. నలపాడ్పై కేసు నమోదు కావడంతో మూడు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇటీవలే బెయిల్పై విడుదలై బయటకొచ్చినప్పటికీ.. అతని తీరులో మాత్రం మార్పు రాలేదంటున్నారు.