కర్ణాటక ప్రభుత్వంలో కుమ్ములాట: బీజేపీకి మంచి అవకాశం; హైకమాండ్ ఆరా, 8మంది కాదు 20 !
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 104 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే 8మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. ఇదే చాన్స్ అంటూ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో బీజేపీ నాయకులు మౌనంగా అన్ని విషయాలు గమనిస్తున్నారు.
ఎమ్మెల్యేల వార్నింగ్
మంత్రి పదవుల పంపకంలో అనేక కులాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎంబి. పాటిల్, హెచ్ఎం. రేవణ్ణ, సతీష్ జారకిహోళి, ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ సుధాకర్ తదితరులు మాకు న్యాయం జరగకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను బహిరంగంగా హెచ్చరించారు.
బీజేపీకి మంచి చాన్స్
బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఒక్క సారి ఆహ్వానిస్తే పరుగున రావడానికి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే కొందరు సిద్దంగా ఉన్నారు. అయితే బీజేపీ అలచెయ్యడానికి ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టలేదని సమాచారం.
సదానంద గౌడ క్లూ
కేంద్ర మంత్రి సదానంద గౌడ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అవకాశం వస్తే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని అన్నారు. మంత్రిపదవుల వియంలో అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలను కేంద్ర మంత్రి సదానందగౌడ బహిరంగంగా బీజేపీలోకి ఆహ్వానించారు.
కొడితే జాక్ పాట్
కురుబ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు హెచ్ఎం. రేవణ్ణ, ఎంటీబీ నాగరాజ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీద అగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నాయకులకు గాలం వేస్తే మరికొంత మంది ఎమ్మెల్యే బయటకు వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే తనను బీజేపీలోకి ఆహ్వానించలేదని హెచ్.ఎం. రేవణ్ణ ఎక్కడా చెప్పలేదు. హెచ్.ఎం. రేవణ్ణ మౌనం వెనుక ఎమైనా ప్లాన్ ఉందా అని విషయం బయటకురాలేదు. అయితే బీజేపీ మాత్రం కొడితే జాక్ పాట్ కొట్టాలని సీనియర్ నాయకులకు వలవేస్తోందని సమాచారం.
బీజేపీ హైకమాండ్ ఆరా
కర్ణాటకలో ప్రస్తుత రాజకీయాలను బీజేపీ హైకమాండ్ గమనిస్తోంది. బీజేపీ ప్లాన్ వేరుగా ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల సమయానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే బీజేపీ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వస్తోందని అంచనావేస్తోంది. బీజేపీ అధికారంలోకి రావడానికి 8 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య 20 వరకు ఉండటంతో బీజేపీ అన్ని విధాలుగా ఆలోచిస్తోంది.