కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా: ఎమ్మెల్సీ నుంచి సిద్దూకు రూ. 65 కోట్లు !
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నామారూపాలు లేకుండా చేస్తానని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప సవాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గోవిందరాజు నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని నామారూపాలు లేకుండా చేస్తానని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సవాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గోవిందరాజు నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబ సభ్వులకు రూ. 65 కోట్లు ముడుపులు అందాయని యడ్యూరప్ప ఆరోపించారు.
ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ శాసన సభ్యుడు దినకర్ శెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రమోద్ హెగ్డే, కోప్పలకు చెందిన కురి హనుమంతప్పలు బెంగళూరులో యడ్యూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్బంగా యడ్యూరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది సీనియర్ నాయకులు త్వరలో బీజేపీలో చేరుతారని అన్నారు. సిద్దరామయ్య, ఆయన మంత్రి వర్గ సభ్యులు తమ పదువులు కాపాడుకోవడానికి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి రూ. వేల కోట్ల ముడుపులు చెల్లించారని ఆరోపించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గోవిందరాజు ఇంటిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత మొత్తంలో ముడుపులు చెల్లించారు అని వివరాలు ఉన్న డైరీ బయటపడిందని యడ్యూరప్ప అన్నారు.
ఈ విషయంపై సిద్దరామయ్య పెదవి విప్పకుండా నిమ్మకునీరెత్తినట్లు కర్చున్నారని విమర్శించారు. డైరీలోని అన్ని ఆంశాలు బయటపడితే సిద్దరామయ్య పరిస్థితి అంతే అంటూ వ్యంగంగా అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గోవిందరాజు ఆడైరీ తనదే అని అంగీకరించడం కాంగ్రెస్ పెద్దలకు మింగుడపడటం లేదని చెప్పారు.
ఎమ్మెల్సీ గోవిందరాజు ప్రస్తుతం బీజేపీకి మేలు చేశారని యడ్యూరప్ప అన్నారు. ఇప్పటికైనా సిద్దరామయ్య ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలకు ముడుపులు చెల్లించామని అంగీకరిస్తే మంచిదని, లేదంటే ప్రజలే వారికి తగిన బుద్దిచెబుతారని యడ్యూరప్ప అన్నారు.