మరో ట్విస్ట్, ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే: మరోసారి సుప్రీం కోర్టుకు కాంగ్రెస్
బెంగళూరు: ప్రొటెం స్పీకర్గా కేజీ బోపయ్యను నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. సీనియర్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరొకరిని నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేసినట్లే, దీనిని సవాల్ చేయనుంది.
ఎనిమిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్పాండేను కాదని బోపయ్యకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయితే, ఆయన గతంలో కూడా స్పీకర్గా పని చేశారని బీజేపీ గుర్తు చేస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం మరోసారి సుప్రీం గడప తొక్కనుంది.
ప్రొటెం స్పీకర్ బాధ్యతలను బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యకు గవర్నర్ అప్పగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ఏర్పాటైన యడ్యూరప్ప ప్రభుత్వం శనివారమే బలనిరూపణ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బలపరీక్ష బోపయ్య ఆధ్వర్యంలోనే జరగనుంది.