కోడ్ ఉల్లంఘన: మోడీపై ఈసికి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ భారత్' అనే రేడియో కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు అక్టోబర్ 15న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎక్కువ మందికి తన ప్రసంగం వినిపించేందుకు రేడియోను ఆశ్రయించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.
మోడీ రేడియో కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. స్వచ్ఛ భారత్, ఖాదీ వస్త్రాల ఉపయోగం, ఇతర అంశాలపై ఆయన చర్చించారు. దేశ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
దేశ ప్రజలందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భారత్ సాధించిన విజయాలను, సాధించాల్సిన విజయాలపై ఆయన ప్రసంగించారు.