శివసేనకు దగ్గరవుతున్న ఎన్సీపీ: మారుతున్న మహా సమీకరణాలు :రంగంలోకి కాంగ్రెస్..ఛాన్స్ ఎవరికి దక్కేను..!
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ..శివసేన ప్రభుత్వం ఏర్పాటు సమయంలో విభేదాలతో దూరమయ్యాయి. అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలనే శివసేన డిమాండ్ కు బీజేపీ అంగీకరించటం లేదు. దీంతో.. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పదవికి రాజీనామా చేసారు.
తాజాగా.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవిస్ను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానించడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైందని వ్యాఖ్యానించిన ఎన్సీపీ....ఒకవేళ బలపరీక్ష అంటూ జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో ఎన్సీపీకి శివసేనకు దగ్గర అవుతోంది. 12న కీలక భేటీ దిశగా మంతనాలు సాగుతున్నాయి.
బీజేపీకి దూరంగా..ఎన్సీపీకి దగ్గరగా..
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవిస్ను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానించడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీని పైన శివసన స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు కనిపించటం లేదు.
చివరి నిమిషంలో సమీకరణాల్లో అనూహ్య మార్పులు జరిగితే మినహా బీజేపీ బలం నిరూపించుకొనే ఛాన్స్ లేదు. ఇదే సమయంలో ఎన్సీపీ ప్రధాన ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆ బీజేపీకి వ్యతిరేకంగా శివసేన ఓటు వేస్తే 'ప్రత్యామ్నాయం' (ప్రభుత్వం) ఏర్పాటు విషయాన్ని తమ పార్టీ ఆలోచిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ తీసుకోవడంలో ఇప్పటికే గవర్నర్ చాలా ఆలస్యం చేశారని ఆయన అన్నారు. బీజేపీ సభ్యులకు మెజారిటీ ఉందా లేదా అనే విషయంలో గవర్నర్ నిశ్చితాభిప్రాయానికి రావాలన్నారు. బలపరీక్షకు ఒకవేళ బీజేపీ సిద్ధపడితే బీజేపీ ఎలాంటి బేరసారాలకు పాల్పడకుండా గవర్నర్ చూడాలని ఆయన కోరారు. బలపరీక్షలో తాము మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న కాంగ్రెస్..
ఫలితాల తరువాత బీజేపీ..శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు. తాము ప్రతిపక్షానికే పరిమితం అవుతామని చెప్పుకొచ్చారు. అయితే, శివసేన తాజా వైఖరితో పవార్ వైఖరిలో మార్పు వచ్చింది. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్సీపీ మద్దతిస్తుందని..కాంగ్రెస్ బయట నుండి మద్దతుగా నిలుస్తుందని ప్రచారం సాగుతోంది.
ఇదే సమయంలో గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించటంతో..తమకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ తెర మీదకు వచ్చింది. దీంతో..శివసేన అలర్ట్ అయింది. సోమవారం నాటికి ఇక్కడ పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.
12న కీలక సమావేశం..
బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే చాన్స్ లేదని భావిస్తున్న ఎన్సీపీ అధినేత పవార్ సమక్షంలో ఈనెల 12న ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు 54 మంది సమావేశమవుతున్నారు. కాగా, శివసేన ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నట్టు పవార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
శివసేన-ఎన్సీపీ కలిసి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోందని వారంటున్నారు. పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారంనాడు సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి 12వ తేదీన ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.