కాంగ్రెస్ త్యాగం చేసింది: ఇంకా జేడీఎస్ కు అనుమానం, డీకే బ్రదర్స్, నాలుగు రోజుల్లోనే వార్ !
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారం నాలుగు రోజులు పూర్తి కాలేదు. అప్పడే ఇరు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు మొదలు పెట్టారు. శనివారం మాజీ ప్రధాని, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తండ్రి హెచ్.డి. దేవేగౌడ కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విధాన సౌధకు మాత్రమే పరిమితం అని చెప్పడంతో వెంటనే డీకే బ్రదర్స్ తెరమీదకు వచ్చారు. కాంగ్రెస్ త్యాగం చేసినా ఇంకా జేడీఎస్ అనుమానంతో చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఆర్ నగర్ కేంద్రం
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్)లో మే 28వ తేదీ సోమవారం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ నగర్ లో జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆర్ఆర్ నగర్ లో శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యింది. ఇరు పార్టీల నాయకులు జోరుగా ప్రచారం చేశారు.
జేడీఎస్ కు అనుమానం
కాంగ్రెస్ పార్టీని జేడీఎస్ ఇప్పటికీ అనుమానంగా చూస్తోందని బెంగళూరు గ్రామీణ లోక్ సభ కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ ఆరోపించారు. శనివారం ఆర్ఆర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ పరోక్షంగా జేడీఎస్ పార్టీ నాయకులకు చురకలు అంటించారు.
దేవేగౌడ పెద్దమనిషి
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ పెద్దమనిషి అని, ఆయన పెద్దమనిషిగానే ఉంటారని కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ అన్నారు. తాము వయసులో చిన్నవాళ్లమని అనిగిమనిగి ఉంటామని డీకే. సురేష్ పరోక్షంగా జేడీఎస్ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.
కాంగ్రెస్ త్యాగం
78 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి జేడీఎస్ కు సీఎం పదవి ఇచ్చిందని డీకే. సురేష్ అన్నారు. అయితే జేడీఎస్ నాయకులు ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులను అనుమానంగానే చూస్తున్నారని డీకే. సురేష్ ఆరోపించారు.
డీకే. బ్రదర్స్ అసహనం
ఆర్ఆర్ నగర్ లో జేడీఎస్ పార్టీ అభ్యర్థి రామచంద్రప్పను పోటీ నుంచి తప్పించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడుకు మద్దతు ఇప్పించాలని డీకే. శివకుమార్ సోదరులు జేడీఎస్ కు మనవి చేశారు. అయితే జేడీఎస్ అభ్యర్థిని పోటీలోనే నిలపడంతో డీకే. శివకుమార్ సోదరులు అసహనంతో ఉన్నారని సమాచారం.