వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ బిల్లులను పార్లమెంటు ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా తీసుకొచ్చిన ది ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్సురెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020కి ఆదివారమే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు సంస్కరణలు రాస్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కోత విధించాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ.
వ్యవసాయం రాస్ట్ర జాబితాలోని అంశమని కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమైనవని పేర్కొన్నారు. ఈ చట్టం చెల్లదని, రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.
అంతేగాక, రైతుల కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ ఎంపీ విన్నవించారు. సమాంతర మార్కెట్లకు అవకాశం ఇస్తే రైతుల దోపిడీకి గురవుతారని తెలిపారు. ఇది ఇలావుండగా, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ బిల్లులను ఆమోదించవద్దంటూ రాష్ట్రపతి కోరారు.
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నేతల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైతులకు మేలు చేసే చట్టాలను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతులకు ప్రయోజనం చేకూర్చే బిల్లులను తమ ప్రభుత్వం తీసుకొస్తే.. ఆ చట్టాలను వ్యతిరేకించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.