సస్పెన్షన్తో స్వేచ్ఛ లభించింది: సబ్బం, ఎంపీల ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. ఆయన మంగళవారం పార్లమెంటు నుంచి సస్పెన్షన్కు గురైన అనంతరం మాట్లాడారు. తాము అన్నింటికీ సిద్ధపడే అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేసినట్లు తెలిపారు.
తాము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదని, పార్టీ తీసుకున్న నిర్ణయానికి మాత్రమే వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 21 తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రాయపాటి సాంబశివరావు తెలిపారు. తమను బహిష్కరించి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని మరో ఎంపి సాయిప్రతాప్ అన్నారు. తమను బహిష్కరించినవాళ్లు మట్టిలో కలిసిపోతారని అన్నారు.
కాంగ్రెస్ బీఫారం తీసుకునేవారుండరు: సబ్బం
ఫిబ్రవరి 21 తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బీ పారం ఇస్తామన్నా తీసుకునేవారు ఉండరని ఎంపి సబ్బంహరి అన్నారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే తమను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 2జీ, బొగ్గు కుంభ కోణం సమయంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు పార్లమెంటును స్తంభింపజేశారని, అప్పుడు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 24 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, తాము ఆరుగురే కాదని, మిగితా ఎంపీలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సబ్బంహరి తెలిపారు. పార్టీ సంకెళ్లు తెంచుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. బహిష్కరించడం ద్వారా బిల్లును అడ్డుకుని, వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ కల్పించి కాంగ్రెస్ తమకు మేలే చేసిందని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో బిల్లును పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు తమ లక్ష్యమని సబ్బం తెలిపారు.
దొంగలు పడ్డ ఆర్నెళ్లకా: హర్షకుమార్
దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కులు మొరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందని ఆ పార్టీ ఎంపి హర్షకుమార్ అన్నారు. తాము అవిశ్వాసం ఎప్పుడో ఇస్తే ఇప్పుడు బహిష్కరించడమేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రులు చిదంబరం, జైరాం రమేష్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాము ప్రజల కోసం బహిష్కరణకు గురైనందుకు గర్వపడుతున్నామని హర్షకుమార్ అన్నారు. తమను బహిష్కరించిన వారు మట్టిలో కలిసిపోతారని మరో ఎంపి సాయి ప్రతాప్ అన్నారు. బహిష్కరణకు గురైనా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.