ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్కు చెంపపెట్టు : రాహుల్పై యోగేంద్ర యాదవ్ ఫైర్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. విపక్ష కాంగ్రెస్ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని అంచనాలతో కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకడుగు ముందేసిన స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ కారణం ...
ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన స్ట్రాటజీ, చేసిన పనులే విజయానికి కారణమవుతున్నాయని యోగేంద్ర యాదవ్ తెలిపారు. భారతదేశ చరిత్రలో పాలుపంచుకోనున్న, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ అనుసరించిన వ్యుహం .. చేసిన పనులే విజయానికి నాంది అని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావంలో కీ రోల్ పోషించిన యోగేంద్ర యాదవ్ 2015లో పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పడాలనే అంశాన్ని తొలినుంచి యోగేంద్ర యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అప్రజాస్వామ్యం, అవినీతికి ఉదహరణ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్సేతర పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని .. కానీ దానికి రాహుల్ గాంధీ లాంటి నేత అడ్డంకులు సృష్టిస్తారని ట్వీట్ చేశారు. అంతేకాదు దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించాక, అంతకుముందు ఆ పార్టీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. వారు చేసిన పనుల గురించి ఈ తరం వారికి చెప్పుకోవాల్సింది ఏమీ లేకుండాపోయిందని విమర్శించారు.
అన్నీ గమనిస్తున్నారు ...
యోగేంద్ర యాదవ్ తీవ్ర విమర్శలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 'నేను కాంగ్రెస్, నా దేశం ఇండియా, కానీ నేను చావాలనుకోవడం లేదు, మీ వ్యాఖ్యలు నిరాశకు గురిచేశాయన్నారు. ప్రతీ దానికి కాంగ్రెస్ పార్టీని దెయ్యంలా చిత్రీకరించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు‘ అని కాంగ్రెస్ నేత ఖుష్బు సుందర్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ సీనియర్లు కూడా సైలెంట్ గా ఉన్నారని గుర్తుచేశారు.
మారిన స్వరం ...
ఎగ్జిట్ పోల్ ఫలితాలను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. ఇది అంతా అబద్ధమని .. ఎన్డీఏ కూటమి సీట్ల సంఖ్య అంతా ఉండదన్నారు. అయితే మాజీ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వరం మాత్రం మారింది. ప్రతీ ఒక్క ఎగ్జిట్ పోల్ తప్పని అనలేమని కామెంట్ చేశారు. దీంతో ఆయన మనసులో మాట ఏంటో అర్థమవుతుంది.