ధమ్కీ: కాంగ్రెసుతో నేషనల్ కాన్ఫరెన్స్ కటీఫ్కు రెడీ
ఎప్రిల్ - మే నెలల్లో లోకసభ ఎన్నికలు, ఈ ఏడాది అక్టోబర్ -నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థితిలో రాష్ట్రంలో 700 కొత్త పాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని ఒమర్ అబ్దుల్లా తలపెట్టారు. ఈ ఆలోచనను కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా వ్యతరేకిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య తెగదెంపులు చేసుకునే పరిస్థితి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ అంబికా సోనీ, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, ఒమర్ సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఏ విధమైన పరిష్కారం లబించలేదు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వచ్చే పథకాన్ని కాంగ్రెసు వ్యతిరేకించడం ఎన్సి వర్గాలకు రుచించడం లేదు. కాంగ్రెసు తీరు పట్ల ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థితిలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలోపడినట్లు చెబుతున్నారు. తద్వారా లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు వచ్చేలా ఒమర్ అబ్దుల్లా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది.