పొత్తులు పొడుస్తున్నాయి: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు
ముంబై: 2019 సాధారణ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు సమయం మాత్రమే ఉండటంతో అప్పుడే పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 24 స్థానాల్లో, ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీచేస్తుండగా మరో స్థానం స్వాభిమాని షెట్కారీ సంఘటన్కు ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలకు చెందిన సీనియర్ నేతల సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్కు 24 సీట్లు..ఎన్సీపీకి 23 సీట్లు
2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 24 స్థానాలు, ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేయనుండగా... హట్కనంగలే సీటును స్వాభిమాని షెట్కారీ సంఘటన్కు కేటాయించినట్లు నేతలు సమావేశం అనంతరం తెలిపారు. 2014 ఎన్నికల్లో స్వాభిమాని షెట్కారీ సంఘటన్ నేత రాజు షెట్టీ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అయితే అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆయన ఉన్నారు. ఈ ఏడాది ఆగష్టులో కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశారు. దీంతో ఆసీటు రాజుకే కేటాయించేందుకు రెండు పార్టీలు సానుకూలత చూపాయి.
పూణే సీటుపైనే రెండు పార్టీల గురి
ఇప్పటికైతే కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయినప్పటికీ... ఎన్సీపీ మాత్రం నాలుగు స్థానాలు తప్పకుండా తమకే ఇవ్వాలనే పట్టుబడుతోంది. ఇందులో పూణే, యవతమాల్ స్థానాలు తమకే దక్కాలనే డిమాండ్ కాంగ్రెస్ ముందుంచుతోంది. ఇదిలా ఉంటే అహ్మద్ నగర్ సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే పూణే సీటుపై కాంగ్రెస్ కాస్త పట్టువీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే పూణే జిల్లాలోని మూడు సీట్లలో ఎన్సీపీ పోటీచేస్తోందని ఇక ఉన్న ఒక్క సీటు కూడా ఎన్సీపీకే కేటాయిస్తే కాంగ్రెస్ పూణేలో కనుమరుగవుతుందని వాదిస్తోంది.
పూణే సీటు ఇస్తే అహ్మద్ నగర్ సీటు కాంగ్రెస్కు ఇస్తాం: ఎన్సీపీ
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అడుగుతున్నట్లుగా అహ్మద్నగర్ సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఎన్సీపీ. ఇక్కడి నుంచి ఎన్సీపీ పోటీ చేసి మూడు సార్లు వరుసగా పరాభవం మూటగట్టుకుంది. అయితే పూణే సీటును కాంగ్రెస్ ఇస్తేనే ఇది జరుగుతుందనే షరతు విధించింది శరద్ పవార్ పార్టీ. అంతేకాదు యవతమాల్ సీటు కూడా ఎన్సీపీకే కేటాయించాలని కోరుతోంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కంటే తమ అభ్యర్థే బలంగా ఉన్నారని చెబుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ససేమిరా అంటోంది. మరోవైపు పాలఘర్ సీటును బహుజన్ వికాస్ అగాధి పార్టీకి కేటాయించేందుకు సుముఖత చూపాయి రెండు పార్టీలు. అయితే ఆ పార్టీ ఈ కూటమితో కలిస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పాయి.
2014లో కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే గెలిచింది
బహుజన్ వికాస్ అగాధి పార్టీ 2014 లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్సీపీ కూటమితో కలిసి పోటీచేసింది. అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ఇప్పటికి బహుజన్ వికాస్ అగాధి పార్టీకి మహారాష్ట్రలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పాలగర్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలుండగా అందులో మూడు స్థానాలు బహుజన్ వికాస్ అగాధి పార్టీకి చెందినవే కావడం విశేషం. అంతేకాదు సీట్ల పంపకాల విషయంలో ఎన్సీపీ కాంగ్రెస్తో బలంగానే వాదించినట్లు సమాచారం. 2014 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర మొత్తం కలిపి కాంగ్రెస్కు రెండు సీట్లు రాగా... తమకు 5 సీట్లు వచ్చినట్లు ఎన్సీపీ గుర్తుచేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 26 స్థానాల నుంచి పోటీచేయగా... ఎన్సీపీ 22 స్థానాల నుంచి పోటీచేసింది.