కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం క్యాన్సిల్, అబ్బేం ఏం లేదన్న అశోక్ చవాన్, బారామతికి అజిత్ పవార్
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినా రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు కూడగట్టేందుకు శివసేన బిజీ బిజీగా ఉంది. ట్రైడంట్ హోటల్లో కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. కానీ ఆ తర్వాత జరగాల్సిన కాంగ్రెస్-ఎన్సీపీ నేతల సమావేశం రద్దవడం చర్చకు దారితీసింది. ఈ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందా అనే అనుమానాలకు తావిస్తోంది.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే శరణ్యమా..? శివసేనకు గవర్నర్ మరో ఛాన్స్ ఇస్తారా...?
రాష్ట్రపతి పాలన
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి పోటీచేశాయి. అయితే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పరిస్థితిని నిశీతంగా గమనించింది. శివసేన ఎన్సీపీతో జతకట్టేందుకు సిద్ధమవడంతో స్నేహహస్తం అందించింది. కానీ కాంగ్రెస్ మాత్రం కనీస ఉమ్మడి ప్రణాళిక పేరుతో సాగదీసింది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
దూరం.. దూరం...
రాష్ట్రపతి పాలన ఆరునెలలు అమలు చేస్తారు. అంతలోపు కూడా ఆయా పార్టీలు మెజార్టీతో గవర్నర్ను కలువొచ్చు. తగిన సంఖ్యాబలం ఉంటే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతిస్తే సభ్యుల సంఖ్య 155కి చేరుతుంది. కూటమిపై శివసేన చర్చొపచర్చలు జరుపుతుంది. కానీ ఇంతలో కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య కాస్త దూరం పెరిగినట్టు అనిపిస్తోంది.
ఎందుకు రద్దంటే..
కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు షెడ్యూల్ ప్రకారం బుధవారం సమావేశం కావాల్పి ఉంది. కానీ చివరి క్షణంలో మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. సమావేశం ఎందుకు రద్దయ్యిందో సమాచారం లేదని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ పేర్కొన్నారు. తమ మీటింగ్ రేపు జరగొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే అంతా బాగుందని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు. వివిధ అంశాలపై ఎన్సీపీతో చర్చిస్తామని.. తమ ఇబ్బందులను తెలియజేస్తామని చవాన్ పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని పేర్కొన్నారు.
అవును.. మీటింగ్ క్యాన్సిల్
కాంగ్రెస్-ఎన్సీసీ సమావేశం రద్దయ్యిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ధ్రువీకరించింది. మీటింగ్ రద్దవడంతో బారామతి వెళ్తున్నట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ పేర్కొన్నారు. గురువారం సమావేశం జరిగితే.. తిరిగొస్తానని తెలిపారు.
తిరిగొచ్చిన ఎమ్మెల్యేలు
మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు ఉంటుంది. ఈ క్రమంలో జైపూర్ రిసార్టులో ఉన్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబై చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటిలో హడావిడి ఏమీ ఉండని నేపథ్యంలో వారిని మహారాష్ట్ర తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఆరునెలలు రాష్ట్రపతి పాలన అమల్లో ఉండే అవకాశం ఉంది.