కాంగ్రెస్కు సంబంధం లేదు: ‘కేంబ్రిడ్జ్ అనాలటికా’ ఆరోపణలపై రణదీప్, బీజేపీపై ఫైర్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా ప్రైవసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో తమకు సంబంధాలు లేవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సర్జీవాలా స్పష్టం చేశారు. ఆ సంస్థ సేవలను 2010లో బీజేపీ, జేడీయూ ఉపయోగించుకున్నాయని ఆరోపించారు.
బుధవారం రణదీప్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సేవలను ఎన్నడూ ఉపయోగించుకోలేదన్నారు. ఆ సంస్థతో తమకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ బూటకపు ఎజెండాతో ఆరోపణలు చేస్తోందని, ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు.
బీజేపీని బూటకపు వార్తల కర్మాగారమని, ఈరోజు మరొక బూటకపు వార్తను ఉత్పత్తి చేసిందని ఎద్దేవా చేశారు. బూటకపు ప్రకటనలు, బూటకపు మీడియా సమావేశాలు, మాయపూరిత ఎజెండాలు బీజేపీకి, న్యాయంలేని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు అలవాటేనన్నారు.
కేంబ్రిడ్జ్ అనలిటికా వెబ్సైట్ను చూసినపుడు 2010లో బీజేపీ, జేడీయూ పార్టీలు ఆ సంస్థ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడవుతోందని సర్జీవాలా అన్నారు. ఆ సంస్థకు చెందిన భారతీయ భాగస్వామి ఒవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ను బీజేపీ మిత్ర పక్ష పార్టీ ఎంపీ కుమారుడు నడుపుతున్నారని ఆరోపించారు. అంతేగాక, ఈ కంపెనీ సేవలను 2009లో రాజ్నాథ్ సింగ్ ఉపయోగించుకున్నారని అన్నారు.