సిద్ధుకు అది మ్యాచ్ కాదు: భార్య ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆయన ఇంకా సందిగ్ధంలోనే ఉన్నరు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆయనను ఆహ్వానిస్తున్నాయి. ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ సోమవారం నాడు స్పందించారు. తన భర్త కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరన్నారు. ఆ పార్టీ సరైన గమ్యస్థానమని తాను భావించడం లేదన్నారు. సిద్ధుతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చర్చలు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా, సిద్ధు పెట్టిన డిమాండ్లకు ఏఏపీ దిగిరాకపోవడం వలలనే ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో సిద్ధూ భార్య.. ఏఏపీని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆ పార్టీ మ్యానిఫెస్టో బాగుందని, సమర్థుడైన నేత ఉంటే పంజాబ్లో పార్టీని ముందుకు నడిపించవచ్చని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని సిద్ధూ డిమాండ్ చేయగా, పార్టీ నియమావళి ప్రకారం, ఒకే ఇంట ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని ఏఏపీ తేల్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఏఏపీలో సిద్ధు చేరికకు అదే అడ్డంకి అంటున్నారు.