అదే భయం: గుజరాత్లో కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు
గుజరాత్ : గుజరాత్లో చాలా రోజుల తర్వాత మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో తమ అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తమ 34 మంది పంచాయతీ సభ్యులను రాజస్థాన్కు తరలించింది. జూన్ 20న అహ్మదాబాద్, పటాన్ జిల్లాలకు పంచాయతీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఇదిలా ఉంటే రెండు పోస్టులకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం జూన్ 19న నామినేషన్ వేసేందుకు తీసుకొస్తామని... ఇతర సభ్యులను నేరుగా పోలింగ్ రోజునే తీసుకొస్తామని జిల్లా కాంగ్రెస్ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం తామంతా రాజస్థాన్లో ఉన్నట్లు చెప్పిన అహ్మదాబాద్ జిల్లా కాంగ్రెస్ చీఫ్ కోడాజీ ఠాకూర్.. తాము రాజస్థాన్లో ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పేందుకు నిరాకరించారు. సొంత వారినే కాంగ్రెస్ వారు కాపాడుకోలేక బీజేపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ప్రతినిధి భరత్ పాండ్య మండిపడ్డారు.
2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్కు తరలించింది. ఈ ఎన్నికల్లో అప్పటి సభ్యుడు అహ్మద్ పటేల్ చాలా స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఈ సందర్భంగా పటేల్కు మద్దతుగా నిలవని 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వేటువేసింది.