నేడే జీఎస్టీ ప్రారంభం: విపక్షాల బాయ్ కాట్.. సర్కార్ అట్టహాసం
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్హాల్ నుంచి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనున్నది. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతున్నాయి. జీఎస్టీని వ్యతిరేకించకపోయినా వివిధ కారణాలతో ఈ పార్టీలు గైర్ఱాజరు అవుతున్నాయి.
కాంగ్రెస్, తృణమూల్, సీపీఐ, ఆర్జేడీలు ఈ కార్యక్రమాన్ని వేర్వేరు కారణాలతో బహిష్కరిస్తుండగా సీపీఎం మాత్రం బహిష్కరించకపోయినా గైర్హాజరవుతున్నట్లు పేర్కొంది. మరోవైపు వివిధ సామాజిక వర్గాలు, పారిశ్రామిక రంగాల్లో జీఎస్టీ అమలు పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వస్త్ర పరిశ్రమ మూడు రోజుల సమ్మెలో పాల్గొంటున్నది. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించి.. ఓపిగ్గా అర్థమయ్యే రీతిలో ప్రచారంచేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.
కానీ ఆగమేఘాల మీద చట్టం అమలు చేయాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. అయితే జీఎస్టీ అమలులో ఇబ్బందుల నేపథ్యంలో రాబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా విపక్షాలుగైర్హాజరుపై పార్టీలు పెద్ద మనస్సు పెట్టాలని, పునరాలోచించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 75 నిమిషాల పాటు నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభ కార్యక్రమంపై ఇప్పటికే రిహార్సల్స్ కూడా జరిపారు.
విపక్షాల బహిష్కరణపై జైట్లీ ఇలా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ తదితరులు వేదికపై ఆసీనులయ్యే విధంగా షెడ్యూలు తయారు చేశారు. కాంగ్రెస్ కార్యక్రమాన్ని బహిష్కరించినందువల్ల మన్మోహన్సింగ్ హాజరు కావడంలేదు. విపక్షాల నిర్ణయంపై ఆవేదన వ్యక్తంచేసిన ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, అందరినీ సంప్రదించాకే కేంద్రం ముందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. విపక్షాలకు జయాపజయాలను సమానంగా స్వీకరించే తత్వం ఉండాలని జైట్లీ అన్నారు. జీఎస్టీకి మద్దతు పలికినందున ఆ పార్టీలు తప్పక హాజరు కావాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో ముందు ఉండే సమాచార, ప్రసారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. ఏ కారణం లేక పోవడం వల్లే కాంగ్రెస్ బహిష్కరిస్తున్నదన్నారు. ముందుగా సమర్థించి తర్వాత ఆవిష్కరణకు గైర్హాజరవుతామని త్రుణమూల్ కాంగ్రెస్ ప్రకటించడం రాజకీయమేనని ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ వ్యాఖ్యానించారు.
గొప్పల కోసమే ప్రధాని పాట్లన్న కాంగ్రెస్ నేత ఆజాద్
పార్లమెంటు సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి జరిగే జీఎస్టీ లాంఛన ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. గురువారం ఉదయం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ తదితరులతో సోనియాగాంధీ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, కానీ ప్రతిష్ఠ కోసం మాత్రం జీఎస్టీ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ను వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆజాద్, ఖర్గే, ఆనంద్శర్మ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి చెందినప్పుడు 1947 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి ఇటువంటి కార్యక్రమం జరిగిందని ఆజాద్ అన్నారు. అటువంటి గొప్పల కోసమే మోదీ ప్రభుత్వం.. జీఎస్టీ ప్రారంభానికి ఈ వేదికను వాడుకుంటున్నదన్నారు. 1972, 1997లో కూడా సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమాలకు నేపథ్యం వేరన్నారు. నాడు 1947లో స్వాతంత్ర్యం వచ్చినందున ఆగస్టు 14వ తేదీన తొలి ప్రధాని నెహ్రూను అనుకరించాలని ప్రధాని మోదీ ఉబలాటపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది.
సర్కార్ వేగిరపాటు సరి కాదన్న ఏచూరి
జీఎస్టీ కార్యక్రమాన్ని బహిష్కరించకపోయినా గైర్హాజరు కావాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నారు. వేగిరపాటుతో జీఎస్టీ అమలు చేయాలన్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అర్జేడీ నేత లాలూప్రసాద్ సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. అయితే బీహార్ ప్రభుత్వం తరఫున విద్యుత్ మంత్రి బిజేంద్రప్రసాద్ యాదవ్ హాజరు కానున్నారు.
జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రతిపత్తి ఇది
ఇప్పటివరకు దాదాపుగా దేశంలోని అన్నిరాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జీఎస్టీని ఆమోదించాయి. సకాలంలో ఆమోదించకపోతే పరిహారానికి దూరమవుతారని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్, కర్ణాటక హడావిడిగా ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తెలిపాయి. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్ముకశ్మీర్ మాత్రమే జీఎస్టీకి మినహాయింపుగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేని కేంద్ర చట్టమేదీ కశ్మీర్లో అమలు కావడానికి వీల్లేదన్న నిబంధనే అందుకు కారణం.