హంపశయ్య పై కాంగ్రెస్ పార్టీ..! అగమ్యగోచరంలో హస్తం నేతలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు లోక్ సభ ఎన్నికల్లో పట్టుమని వంద సీట్లు కూడా రాకపోవడం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. మరోవైపు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ నాయకుల్లో సంక్షోభం నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను అతలాకుతలం చేస్తోంది. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్లతో భేటీలోనూ ఆయన ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ పంజాబ్, ఝార్ఖండ్, అసోం పీసీసీ అధ్యక్షులు సునీల్ జాకర్, అజయ్ కుమార్, రిపున్ బోరాలు రాజీనామాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్ 542 లోక్సభ స్థానాల్లో 52 మాత్రమే గెలవగలిగింది.
2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే పెరిగాయి. ఓటమికి బాధ్యతగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. పరాజయానికి సమష్టి బాధ్యత తీసుకుందామని సీనియర్లు నచ్చజెప్పినా రాజీనామాను ఆమోదించాల్సిందేనంటూ రాహుల్ పట్టుబడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్కు కొత్త సారథి రావాల్సిందేనని, అది కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి ఉండాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారని సమాచారం. రాహుల్ నిర్ణయం మార్చుకోకుంటే సోనియా, ప్రియాంకను పార్టీ అధ్యక్ష పదవికి నేతలు ప్రతిపాదిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.