కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్, పంజాబ్ నేషన్ బ్యాంక్ స్కాం కేసు లింక్, నాలుగు బీఫారంకు బ్రేక్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా మాకు టిక్కెట్లు రాలేదని అసమ్మతి నాయకులు, కార్యకర్తలు, మీడియా ముందు కన్నీరు పెట్టుకుని లబోదిబో అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో విచిత్ర సంఘటన ఎదురైయ్యింది. టిక్కెట్లు కేటాయించినా కొన్ని సమస్యల కారణంగా అభ్యర్థులు బీఫారం తీసుకోలేకపోతున్నారు. 218 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో నలుగురి బిఫాంలను పక్కన పెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసు లింక్ తో బీఫారం పక్కనపెట్టేశారు.
సుప్రీం కోర్టు న్యాయవాది
కర్ణాటకలోని మడికేరి శాసన సభ నియోజక వర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ హెచ్.ఎస్.చంద్రమౌళిని ప్రకటించింది. మంగళవారం హెచ్.ఎస్. చంద్రమౌళి బీఫారం తీసుకుని నామినేషన్ వెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే చంద్రమౌళి విషయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీం కోర్టు న్యాయవాది బ్రిజేష్ కాళప్ప అసహనం వ్యక్తం చేసి మండిపడటంతో ఆయన బీఫారం పక్కన పెట్టారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ మామ, గితాంజలి జ్యువెలర్స్ యజమాని మోహుల్ చోక్సీ కేసులను న్యాయవాది చంద్రమౌళి వాదిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద స్కాం అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం నిందితుల కేసు వాదిస్తున్న న్యాయవాది చంద్రమౌళికి ఎలా టిక్కెట్ ఇస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు రావడంతో ఆయన బీఫారం పక్కన పెట్టేశారు.
సీఎంకు నో టిక్కెట్ !
బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గం నుంచి సీఎం సిద్దరామయ్య పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సీఎం సిద్దరామయ్య బాదామిలో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిరాకరించి చాముండేశ్వరి నియోజక వర్గంలోనే పోటీ చెయ్యాలని సూచించింది.
సీఎంను కాదని సీటు ఇస్తే !
బాదామి నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) బిబి. చిమ్మనకట్టి, సీఎం సిద్దరామయ్యను కాదని మూడో వ్యక్తి డాక్టర్. దేవరాజ్ పాటిల్ కు టిక్కెట్ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చెయ్యలేనని డాక్టర్. దేవరాజ్ పాటిల్ చేతులు ఎత్తేశారు. దేవరాజ్ పాటిల్ కు బీఫారం ఇవ్వరాదని సీఎం సిద్దూ సూచించడంతో ఆ బీఫారం పక్కన పెట్టారు.
బెంగళూరులో ఆ టిక్కెట్ వద్దు
బెంగళూరు నగరంలోని బోమ్మనహళ్ళి శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ టిక్కెట్ పుష్పా రాజగోపాల రెడ్డికి కేటాయించారు. అయితే బోమ్మనహళ్ళి నియోజక వర్గం నుంచి తాను పోటీ చెయ్యలేనని పుష్పా రాజగోపాల రెడ్డి అంటున్నారని తెలిసింది. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం టిక్కెట్ ను పుష్పా రాజగోపాల్ రెడ్డి ఆశించడంతో ఆ బీఫారం పక్కన పెట్టారు.
తిపటూరు తంటాలు
తిపటూరు శాసన సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కే. పడక్షరికి టిక్కెట్ నిరాకరించి వేరే వారికి టిక్కెట్ కేటాయించారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పడక్షరి నేరుగా సీఎంను హెచ్చరించడంతో ఆ నియోజక వర్గం బీఫారం పక్కన పెట్టారు.
బెంగళూరులో బీఫారం
కర్ణాటకలోని 218 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో బీఫారంలు ఇస్తోంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ బీఫారంలు పంపిణి చేస్తున్నారు.