రాహుల్కే పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు, సీడబ్ల్యూసీలో ఏం జరిగిందంటే ?
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి సమావేశం (సీడబ్ల్యూసీ)లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలని ముక్తకంఠంతో కోరింది.
ఓటమిని అంగీకరిస్తున్నాం ..
అంతకుముందు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారని .. కానీ సీడబ్ల్యూసీ తోసిపుచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. పార్టీ పునర్నిర్మాణం చేయాలని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు మార్పు, చేర్పులు చేసే అధికారం ఇస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీనికోసం త్వరలో ప్రణాళిక కూడా రచిస్తామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా సమస్యలపై క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని స్పష్టంచేశారు.
అంచనాలను అందుకోలేకపోయింది
కాంగ్రెస్ పార్టీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిందన్నారు సీనియర్ నేత ఏకే ఆంటోని. అంతే తప్ప తమ పనితీరు ఘోరంగా ఏమీ లేదని పేర్కొన్నారు. ఓటమిపై సమగ్రంగా చర్చించి .. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి .. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తామని స్పష్టంచేశారు. తిరిగి పార్టీకి పునరుజ్జీవం అందజేస్తామని నేతలు ముక్తకంఠంతో చెప్పారు. 2004కు ఉన్న పరిస్థితి ఇప్పుడుని .. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు.
రాహుల్ సమర్థుడే ..
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నాయకత్వంపై ఏ ఒక్కరికీ అనుమానం లేదన్నారు సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు చూపారాని కొనియాడారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని .. నాయకత్వ లక్షణం వేరే విషయమని తెలిపారాయన. ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోందని .. ఇది అభ్యర్థుల ఓటమే తప్ప .. సిద్ధాంతాల వైఫల్యం కాదని తేల్చిచెప్పారు.