గాలి, భీమా నాయక్ కేసు సీబీఐకి: కాంగ్రెస్
బెంగళూరు: ప్రత్యేక భూస్వాధీనాధికారి భీమా నాయక్ కారు డ్రైవర్ రమేష్ ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విధాన పరిషత్ సభ్యుడు (ఎంఎల్ సీ), ప్రముఖ న్యాయవాది వీ.ఎస్. ఉగ్రప్ప డిమాండ్ చేశారు.
రెవెన్యూ శాఖ అధికారి (కేఏఎస్) అధికారి భీమా నాయక్ అక్రమాస్తుల గురించి, అతని అరాచకాల గురించి వెలుగు చూడాలంటే సీబీఐ దర్యాప్తు సరైన మార్గం అని అన్నారు. ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, భీమా నాయక్ మీద మండిపడ్డారు.
గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకుడు అని గుర్తు చేశారు. ఆయన తన కుమార్తె పెళ్లి చెయ్యడం కోసం రూ. 100 కోట్ల పాత నోట్లను భీమా నాయక్ ఇచ్చి కొత్త నోట్లుగా మార్చుకున్నాడని రమేష్ ఆత్మహత్య చేసుకునే ముందు డోత్ నోట్ లో రాసి పెట్టాడని గుర్తు చేశారు.
గాలి జనార్దన్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్వయం ప్రేరితంగా స్పందించి ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఉగ్రప్ప డిమాండ్ చేశారు.
నగదు వ్యవహారం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, ఇలాంటి విపయాల్లో కేంద్రం స్వతంత్రంగా సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత నోట్ల మార్పిడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉగ్రప్ప కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటక అధికారులు చిక్కరాయప్ప, జయచంద్రల కేసులు కూడా సీబీఐకి అప్పగించాలని ఉగ్రప్ప డిమాండ్ చేశారు.