చౌకీదార్ చైనీస్ హై: మోదీపై కొత్త అస్త్రం.. జవాన్లు చనిపోతే ప్రధానికి చైనా ప్రశంసలా?.. కాంగ్రెస్ ఫైర్
గాల్వాన్ లోయలో చైనా సైన్యం అతి కిరాతకంగా 20 మంది భారత జవాన్లను హతమార్చడం, మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన ఘటన, తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను చైనా అధికారిక మీడియా స్వాగతించడంపై వివాదం కొనసాగుతున్నది. భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోతే.. చైనా ప్రభుత్వ పత్రికలు మోదీని ప్రశంసించడమేంటని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది..
చైనా దురాగతం.. భారతీయ విద్యార్థులకు బెదిరింపులు.. బలవంతపు క్షమాపణలు.. అది ఆత్మహత్యేనంటూ..
చౌకీదార్ చైనీస్ హై..
‘‘సరిహద్దు వివాదాన్ని సరిగా డీల్ చేయలేక చైనాకు సరెండర్ అయిపోయారు.. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు.. సరెండర్ మోదీ'' అంటూ ప్రధానిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ తాజాగా మోదీని చైనీస్ గా పేర్కొంటూ ‘‘చౌకీదార్ చైనీస్ హై'' అనే విమర్శనాస్త్రాన్ని సంధించింది. అంతేకాదు, చైనాతో మోదీకి గాఢమైన అనుబంధం ఉందంటూ కొన్ని సోదాహరణలు చెప్పుకొచ్చింది. గత లోక్ సభ ఎన్నికల్లో ‘నేను దేశానికి చౌకీదార్'అంటూ మోదీ ప్రచారం నిర్వహించడం, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లలో అక్రమాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ రివర్స్ లో ‘చౌకీదార్ చోర్ హై'అని ఎదురుదాడి చేయడం తెలిసిందే.
చైనాతో ఆయన బంధం..
‘చౌకీదార్ చైనీస్ హై' నినాదాన్ని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ విభాగం క్రియేట్ చేయగా, గత కొద్ది గంటలుగా ఆ హ్యాష్ ట్యాట్ ట్రెండింగ్ లో నిలిచింది. ‘‘ఆయన(మోదీ) సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చైనా వాళ్లతో కట్టించారు.. చైనా పెట్టుబడులున్న పేటీఎంకు బ్రాండ్ అంబాజిడర్ లా వ్యవహరిస్తారు.. చైనీస్ ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో కలిసి ఉయ్యాలలూగారు.. భారీ రోడ్డు, టన్నెల్ ప్రాజెక్టులను చైనీస్ కంపెనీలకు కట్టబెట్టారు.. ఏకంగా తొమ్మిది సార్లు చైనాకు వెళ్లొచ్చారు.. మోదీకి ఆ దేశమంటే ప్రీతి అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు కావాలా?''అని కాంగ్రెస్ సేవాదళ్ ఆరోపించింది.
దేశద్రోహం కాదా..
గాల్వాన్ హింస తర్వాత చైనా ప్రభుత్వ పత్రికల్నీ మోదీని ఆకాశానికెత్తడంపై కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కారు తీరును ప్రశ్నించిన అందరినీ ఆ పార్టీ దేశద్రోహులుగా ముద్రవేయడాన్ని, చైనాతో మోదీ స్నేహంగా ఉండటాన్ని గుర్తుచేస్తూ.. ‘‘చైనీయుల స్నేహితుడు ఇండియాకు ద్రోహే అవుతాడుగా''అని వ్యాఖ్యానించారు.
Recommended Video
రాజీవ్ గాంధీ తీసిన ఫొటోతో..
గాల్వాన్ హింస, ఎల్ఏసీ ఉద్రిక్తతలపై కేంద్రం ప్రజలకు నిజాలు చెప్పడంలేదంటోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం మరోసారి ప్రధానిపై విరుచుకుపడ్డారు. ‘‘చైనా దాడికి వ్యతిరేకంగా అందరం ఏకమై నిలబడతాం. అయితే, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా?'' అని ప్రశ్నించారు. ఈ మేరకు తాను చేసిన ట్వీట్ లో రాహుల్.. తన తండ్రి రాజీవ్ గాంధీ తీసిన పాంగాంగ్ సరస్సు ఫొటోను షేర్ చేశారు. చైనా విషయంలో కేంద్రం చాలా విషయాల్ని దాచిపెడుతోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అఖిలపక్ష భేటీలోనూ ఆరోపించడం తెలిసిందే.