రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే సవాల్, జయలలిత ఫోటో, చాలెంజ్!
Recommended Video
చెన్నై: తమ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే సవాల్ చేయడం ఎంత మాత్రం సహించబోమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ అన్నారు. ఎమ్మెల్యే విజయధరణిపై కఠిన చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశానని ఆయన మీడియాకు చెప్పారు. కాంగ్రాస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించిన విజయధరణిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తిరునావుక్కరసర్ స్పష్టం చేశారు.
జయలలిత చిత్రపటం
ఫిబ్రవరి 12వ తేదీన తమిళనాడు శాసన సభ హాలులో ఆ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రుల సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఆవిష్కరించారు.
ప్రతిపక్షాలు బహిష్కరణ
జయలలిత నిలువెత్తు చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో సహ ఆర్ కే నగర్ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ బహిష్కరించారు.
వీరప్పన్ ఫోటో పెట్టండి
అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయిన జయలలిత చిత్రపటం అసెంబీలో పెట్టడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మండిపడ్డారు. జయలలిత చిత్రపటం తరువాత స్మగ్లర్ వీరప్పన్, సీరియల్ కిల్లర్ ఆటో శంకర్ ఫొటోలు అసెంబ్లీలో ఆవిష్కరిస్తారని తమిళనాడు కాంగ్రెస్ మాజీ అద్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ విమర్శించారు.
విజయధరణి హాజరు
కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయధరణి హాజరైనారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి జయలలిత చిత్రపటం అవిష్కరించడాన్ని తాను సమర్థిస్తున్నానని బహిరంగంగా ప్రకటించి స్పీకర్ ధనపాల్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినంధించారు. విజయధరణి ప్రవర్తనపై తిరునావుక్కరసర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
అపోలో ఆసుత్రికి ఎందుకు ?
కాంగ్రెస్ పార్టీ నాయకులు తన మీద చేస్తున్న ఆరోపణలపై విజయధరణి ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందక ముందే ఆమె అక్రమాస్తుల కేసులో నింధితురాలు అని కోర్టు చెప్పిందని, అలాంటి సమయంలో రాహుల్ గాంధీ, తిరునావుక్కరసర్ ఎందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారని ప్రశ్నించారు.
అంత్యక్రియలు బహిష్కరణ
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించారని, తరువాత రాహుల్ గాంధీ, తిరునావుక్కరసర్ ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి గుర్తు చేశారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలు అయిన జయలలిత అంత్యక్రియలను రాహుల్ గాంధీ, తిరునావుక్కరసర్ ఎందుకు బహిష్కరించలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు.
అది నా హక్కు
జయలలిత చిత్రపటం ఆవిష్కరణపై నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని, అది నాహక్కు అని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని, ఓ మహిళగా హాజరైనానని, ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదులు అందుతాయని తనకు తెలుసని, రాహుల్ గాంధీ అయినా, తిరునావుక్కరసర్ అయినా సరే నా హక్కులను భంగపరచలేరని ఎమ్మెల్యే విజయధరణి టీవీ చానల్ ఇంటర్వూలో అన్నారు.
రాహుల్ గాంధీ
విజయధరణి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించారని. ఆమె కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే ధిక్కరించారని ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ అన్నారు. విజయధరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశామని తిరునావుక్కరసర్ మీడియాకు చెప్పారు.
దేనికైనా సిద్దం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నిలదీసిన విజయధరణి తాను దేనికైనా సిద్దంగానే ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఇళంగోవన్, విజయధరణి మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో విజయధరణి తనపలుకుబడి ఉపయోగించి ఇళంగోవన్ ను పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో తిరునావుక్కరసర్ ను నియమించారు.