ఆపరేషన్ కమల, మాజీ సీఎంకు సెగ, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇంటి ముందు ఒక్కసారిగా ప్రత్యక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
బెంగళూరు నగరంలోని డాలర్స్ కాలనీలోని బీఎస్. యడ్యూరప్ప ఇంటి ముందు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇంటిలో యడ్యూరప్పతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రేణుకాచార్య, విశ్వనాథ్, రవికుమార్ తదితరులు ఉన్నారు.
ఆపరేషన్ కమల పేరుతో యడ్యూరప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. యడ్యూరప్ప ఇంటిలో చొరబడటానికి ప్రయత్నించారు. ఇంటిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు.
మాటామాట పెరడంతో ఎమ్మెల్యేలు రేణుకాచార్య, విశ్వనాథ్, రవికుమార్ తదితరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు.
కాంగ్రెస్ పార్టీ గూండాలు మాజీ సీఎం ఇంటి ముందు దౌర్జన్యం చేశారని, ప్రభుత్వం వారికి అండగా ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మాతో పెట్టుకుంటే మా పవర్ ఏమిటో చూపిస్తామని సీఎం కుమార్ స్వామి గురువారం మద్యాహ్నం చెప్పారని, కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యర్తలు యడ్యూరప్ప ఇంటి దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.