బీజేపీ అజెండాతో జనంలోకి కాంగ్రెస్- గోరక్ష మార్చ్, తిరంగా యాత్రలు- ఎల్లుండి నుంచే
2014 ఎన్నికల తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సాధించాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది తగిలిన ఎదురుదెబ్బల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది వరకూ ఆగకుండా ఎల్లుండి పార్టీ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కాంగ్రెస్ ఎంచుకున్న వ్యూహం మాత్రం ఆసక్తికరంగా ఉంది. బీజేపీ అజెండాలోని రెండు అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా ముల్లును ముల్లుతోనే వ్యూహం అమలు చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
పునరుజ్జీవానికి కాంగ్రెస్ పాట్లు..
సరిగ్గా దశాబ్దం క్రితం బలమైన యూపీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రత్యర్ధులకు సవాళ్లు విసిరిన కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో కుదేలైంది. ముఖ్యంగా 2014 ఎన్నికైన పరాజయం తర్వాత మారిన పరిస్ధితులను సమీక్షించుకుని ప్రజల్లోకి వెళ్లే వ్యూహమే కాంగ్రెస్ దగ్గర లేకుండా పోయింది. దీంతో 2019లోనూ మరో ఘోర పరాజయం వెక్కిరించింది. గతేడాది ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడక ముందే సీనియర్ల తిరుగుబాటుతో ఎదురైన పరిస్ధితికి అధినేత్రి సోనియా వద్ద సమాధానం లేకుండాపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లే అనుకుంటున్నసమయంలో కొత్త అజెండాతో బరిలోకి దిగాలని భావిస్తుండటం ఆసక్తి రేపుతోంది.
గోరక్షా మార్చ్, తిరంగా యాత్రలతో..
బీజేపీ అజెండాలో సర్వసాధారణంగా కనిపించే రెండు అంశాలు గోరక్షా ఉద్యమం, తిరంగా యాత్రలు. ఈ రెండింటినీ తాము కూడా ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారో లేక వీటి ప్రస్తావన లేకుండా జనంలోకి వెళ్లడం కష్టమనుకుంటున్నారో తెలియదు కానీ తాజాగా ఈ రెండు అంశాలను ఫాలో కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అదీ ఎల్లుండి పార్టీ వ్యవస్దాపక దినోత్సవం నుంచే. ముందుగా యూపీలోని బుందేల్ ఖండ్లో గో రక్షా మార్చ్, తిరంగా యాత్రలు నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతలకు సమాచారం పంపారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూనే వీటిని నిర్వహించాలని అన్ని రాష్ట్రాల పార్టీ శాఖలకూ ఆయన లేఖలు రాశారు.
ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం
ఒకప్పుడు ఏ అంశాలతో అయితే జనంలోకి వెళ్లి బీజేపీ సక్సెస్ అయిందో సరిగ్గా అవే అంశాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ అజెండాగా ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. జనం మూడ్ ఆధారంగా వాటిని ఎంచుకోవడం ద్వారా ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎల్లుండి నుంచి గోరక్షా మార్చ్లు, తిరంగా యాత్రలను ప్రారంభించబోతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడాదికి 1971 నాటి భారత్-పాక్ యుద్దానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇందిరాగాంధీ ఉక్కు సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తద్వారా జనంలో దేశభక్తిని రగిలించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే జనం వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.