కర్ణాటకలో మా ఓటు బ్యాంకు పెరిగింది, కాంగ్రెస్ అన్ని హద్దులు దాటింది: అమిత్ షా
న్యూఢిల్లీ: కర్ణాటక లో తమ పార్టీ ఓటు బ్యాంకు గెలిచిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకొనేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల హద్దులను దాటిందని ఆయన ఆరోపించారు.కానీ, ప్రజలంతా తమ వైపే ఉన్నారని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఆయన చెప్పారు.
సోమవారం నాడు న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కర్ణాటకటో ఓట్ల శాతం తగ్గినా కానీ,కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా గొప్పలు చెప్పుకొంటుందని ఆయన ఎద్దేవా చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ పార్టీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు.
ఐదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అమిత్ షా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్ పార్టీ భయబ్రాంతులకు గురి చేసిందని చెప్పారు. జెడి(ఎస్), కాంగ్రెస్ పార్టీ కూటమిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిందని అమిత్ షా ఆరోపించారు. ప్రజలు ఏ పార్టీకి కూడ మెజారిటీని ఇవ్వలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారని ఆయన చెప్పారు.
కులం, మతం పేరుతో కూడ కాంగ్రెస్ పార్టీ ఓట్లను అడిగిందని అమిత్ షా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే 3700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు.