అర్దరాత్రి ఇల్లూ, ఊరు ఖాళీ చేసిన స్యాండిల్ వుడ్ క్వీన్: ఫ్యాన్స్ దెబ్బకు హడల్, రాజకీయ జీవితం క్లోజ్!
బెంగళూరు: రెబల్ అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాకపోవడంతో అభిమానుల తీవ్ర ఆగ్రహానికి గురైన స్యాండిల్ వుడ్ క్వీన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్యా అలియాస్ దివ్యా స్పందన ఆందోళనకు గురైనారని సమాచారం. ఎక్కడ అభిమానులు తన మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారో అని ఆలోచించిన రమ్యా, ఆమె కుటంబ సభ్యులు రాత్రికి రాత్రే ఇల్లూ, ఊరు ఖాళీ చేశారు. ఫ్యాన్ దెబ్బకు ఇక అక్కడ తన రాజకీయ జీవితం క్లోజ్ అని రమ్యా భావించారని తెలిసింది.
లోక్ సభ ఉప ఎన్నికలు
రెబల్ స్టార్ అంబరీష్ ఆశీస్సులతో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సంపాదించి పోటీ చేసిన నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన ఎంపీగా విజయం సాదించారు. అనంతరమం మండ్యలోని విద్యానగర్ లో ఆమె ఓ పెద్ద బంగ్లాను అద్దెకు తీసుకుని కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి
2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన రమ్యా జేడీఎస్ అభ్యర్థి సీఎస్. పుట్టరాజు చేతిలో ఓటమిపాలైనారు. అనంతరం తన ఓటిమికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణం అంటూ రమ్యా అసహనం పెంచుకున్నారు. తన ఓటిమికి పరోక్షంగా రెబల్ స్టార్ అంబరీష్ కారణం అని, అందుకే ఆయన ఎన్నికల ప్రచారం చెయ్యడానికి రాలేదని రమ్యా అనుమానం పెంచుకున్నారు.
జిల్లా ప్రజలకు దూరం
2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలైన రమ్యా మండ్యతో పాటు ఆ జిల్లా ప్రజలకు దూరం అయ్యారు. మండ్యలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇక్కడే నివాసం ఉంటానని, మీ సమస్యల పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన రమ్యా మండ్యతో పాటు ఆ జిల్లాకు దూరం అయ్యారు.
అమ్మతో రాజకీయం
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా భాద్యతలు స్వీకరించిన నటి రమ్యా ఢిల్లీ, బెంగళూరుకే పరిమితం అయ్యారు. మండ్యలో ఒక్కసారి అడుగుపెట్టని రమ్యా ఆమె తల్లితో అక్కడి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నించారు. 2018 శాసన సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన మండ్య లోక్ సభ ఉప ఎన్నికల్లో రమ్యాకు కాకుంటే తనకే టిక్కెట్ ఇవ్వాలని ఆమె తల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేశారు, అయితే రమ్యాతో పాటు ఆమె తల్లికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు.
ఆభిమానుల ఆగ్రహం
2018 శాసన సభ, లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి రమ్యా మండ్యకు వెళ్లలేదు. ఎదో పని మీద రమ్యా రాలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెబల్ స్టార్ అంబరీష్ అంత్యక్రియలకు రమ్యా హాజరు కాకపోవడంతో ఆయన అభిమానుల ఆగ్రహానికి ఆమె గురైనారు. అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాని రమ్యా మండ్యలో అడుగు పెడితో పరిస్థితులు తీవ్రస్థాయిలో ఉంటాయని ఆయన అభిమానులు హెచ్చరించారు.
మేడమ్ బంగ్లా ఖాళీ
2014 లోక్ సభ ఎన్నికల తరువాత ఒకటి రెండు సార్లు మాత్రమే మండ్యలోని ఇంటికి వెళ్లిన రమ్యా తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. రమ్యా తల్లి మాత్రం ఆ ఇంటిలో ఉంటున్నారు. మండ్యలో నివాసం పెట్టిన సందర్బంలో ఇంటికి అవసరమైన సామాగ్రి, వస్తువులను రమ్యా తీసుకెళ్లారు. అయితే ఆదివారం అర్దరాత్రి 2 గంటల నుంచి సోమవారం వేకువ జామున 4 గంటల మధ్యలో విద్యానగర్ లోని రమ్యా ఇంటి ముందు రెండు మూడు లారీల్లో సామాగ్రి లోడ్ చేసి తీసుకెలుతున్న సమయంలో కొందరు వీడియో తీశారు.
రాజకీయ జీవితం అంతం
మండ్యలోని విద్యానగర్ లోని రమ్యా ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మండ్యలో ఇక తన రాజకీయ జీవితం ముగిసిందని, అనవసరంగా ఇంటి అద్దె, ఖర్చులు ఎందుకని భావించిన ఆమె ఇల్లు ఖాళీ చేసి ఉంటారని ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. ముఖ్యంగా అంబరీష్ అభిమానుల ఆగ్రహానికి గురైన రమ్యా మండ్యకు దూరంగా ఉంటే మంచిదన నిర్ణయించారని తెలిసింది. అంబరీష్ అభిమానుల దెబ్బకు రమ్యా ఇల్లు, ఊరు వదిలిపెట్టారని ప్రచారం జరుగుతోంది.