షాక్: రాహుల్ గాంధీ విమానం 20 సెకండ్లు ఆలస్యం అయితే కూలిపోయేది, డీజీసీఏ!
Recommended Video
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానం ల్యాండ్ కావడం 20 సెకండ్లు ఆలస్యం అయి ఉంటే కుప్పకూలిపోయేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)బాంబు పేల్చింది. ఒక జాతీయ స్థాయి నాయకుడు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ముందుగానే గుర్తించలేకపోయారని నాలుగు నెలల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది.
కర్ణాటక ఎన్నికలు
కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా 2018 ఏప్రిల్ 26వ తేదీన ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ హుబ్బళికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆ రోజు హుబ్బళి ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
చిన్న సమస్య అన్నారు !
ఏప్రిల్ 26వ తేదీ రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ విషయంపై టైమ్స్ నౌ సమర్పించిన ఆర్ టీఐ అర్జీకి సమాధానం ఇచ్చిన DGCA విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది అని స్పష్టం చేసింది. చిన్న సాంకేతిక లోపం కారణంగానే విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారని అప్పట్లో DGCA వివరణ ఇచ్చింది.
డీజీపీకి ఫిర్యాదు
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుమానం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడే కర్ణాటక డీజీపీ నీలమణి రాజుకు ఫిర్యాదు చేశారు. హుబ్బళి ఎయిర్ పోర్టు అధికారులు రాహుల్ గాంధీ ప్రయాణించిన విమానం పైలెట్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి వివరాలు సేకరించారు.
ముందు జాగ్రత్తలు లేవు ?
దేశంలో ఎంతో ప్రభావం ఉన్నటువంటి నాయకుడు ప్రయాణించిన విమానంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, సాంకేతిక లోపాలు ఉన్నాయా అని పరిశీలించలేదని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సందర్బంగా రాహుల్ గాంధీకి ఎదైనా జరగరానిది జరిగి ఉంటే ఎలా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు రాహుల్ గాంధీతో పాటు మరో ముగ్గురు అదే విమానంలో ప్రయాణించారు.
ప్రధాని మోడీ ఫోన్
ఏప్రిల్ 26వ తేదీ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అదే రోజు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన 2.30 గంటల తరువాత రాహుల్ గాంధీ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో ఆటో ఫైలెట్ సిస్టం సవ్యంగా పని చెయ్యకపోవడం వలనే సాంకేతిక లోపం తలెత్తిందని DGCA ఇప్పుడు వివరణ ఇచ్చింది. మొత్తం మీద ఏప్రిల్ 26వ తేదీ రాహుల్ గాంధీ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని ఆలస్యంగా వెలుగు చూసింది.