వైమానిక దళ పైలెట్లకు సెల్యూట్.. రాహుల్ : వెయ్యి ముక్కలు చేస్తామన్నారు..వెయ్యి కేజీల బాంబులేయడం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మనదేశ వైమానిక దళం చేసిన దాడుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ చర్యను ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను అణచి వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, దానికి తాము మద్దతు ఇస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే ప్రకటించారు.
దీనికి అనుగుణంగా ఆయన స్పందించారు. భారత వైమానిక దళం చేసిన దాడులను రాహుల్ గాంధీ ప్రశంసించారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. భారత వైమానిక దళ పైలెట్లకు సెల్యూట్.. అని ట్వీట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో 12 మిరాజ్ యుద్ధ విమానాలు, 2000ల జెట్ ఫైటర్లతో భారత వైమానిక దళం సరిహద్దులను దాటింది. జమ్మూకాశ్మీర్ పరిధిలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై నిరంతరాయంగా దాడులు కొనసాగింది.
సుమారు వెయ్యి కేజీల బాంబులను మోసుకెళ్లిన యుద్ధ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై జార విడిచాయి. వాటిని ధ్వంసం చేసేశాయి. తాము చేపట్టిన ఈ దాడులు వందశాతం విజయవంతం అయినట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. అటు- పాకిస్తాన్ సైన్యం కూడా ఈ దాడులను ధృవీకరించింది.
అవి మన భూభాగాలే: ఎప్పుడైనా దాడులు చేసుకోవచ్చు: సుబ్రహ్మణ్య స్వామి
మరోవైపు- బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి దీనికి భిన్నంగా స్పందించారు. వైమానిక దళం దాడులు చేసిన ప్రాంతాలన్నీ దాదాపు మన భూభాగం పరిధిలోనే ఉన్నాయని, వాటిపై ఎప్పుడైనా దాడులు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బాలాకోట్, ఛకోటి, ముజప్ఫరాబాద్ ప్రాంతాలు మన భూభాగానికి చెందినవేనని సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. వాటిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మాత్రమే గుర్తించారని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మనం ఎప్పుడైనా ఆ ప్రాంతాలపై దాడులు చేసుకోవచ్చని, ఇందులో తప్పేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
మనదేశాన్ని వెయ్యి ముక్కలు చేస్తామన్నారు..
పాకిస్తాన్ మన దేశాన్ని అనేకసార్లు అవమానపరిచిందని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మనదేశాన్ని వెయ్యి ముక్కలు చేస్తామని గతంలో పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు చేసిన ప్రకటనలను ఆయన గుర్తు చేశారు. మనదేశాన్ని వారు వెయ్యి ముక్కలు చేస్తామని బెదిరించారు. దీనికి ప్రతీకారంగా మనం వెయ్యి కేజీల బాంబులతో దాడులు చేయడం సరైన పనే.. అని చెప్పారు. ఒకవేళ- ఆ ప్రాంతాలను తమవిగా పాకిస్తాన్ ప్రకటించుకున్నప్పటికీ.. స్వీయ రక్షణ కోణంలో దాడులు చేయవచ్చని అన్నారు.