కేరళ వరదలు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భేటీ, ధైర్యంగా ఉండాలి, రెండు రోజులు!
తిరువనంతపురం: కేరళలోని వరద బాధిత ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. కేరళలోని చెంగన్నూర్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని మంగళవారం రాహుల్ గాంధీ సందర్శించారు.
ఈ సందర్బంగా వరద బాధితులకు అందుతున్న సహాయం గురించి అక్కడి అధికారులను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ వారికి ధైర్యం చెప్పారు. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ కేరళలో పర్యటించనున్నారు.
ఈ సందర్బంగా కేరళలోని అనేక పునరావాస కేంద్రాలకు రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. వరద బాధితులను సకాలంలో ఆదుకుని వారి ప్రాణాలను రక్షించిన చేపలు పట్టేవారు, రక్షాణ సిబ్బంది, పలు సంఘ సంస్థలతో రాహుల్ గాంధీ చర్చించి వారికి కృతజ్ఞతలు చెబుతారని కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
రాహుల్ గాంధీ ఆగస్టు 24వ తేదీన కేరళలో పర్యటించవలసి ఉంది. అయితే రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సందర్బంగా కేరళ పర్యటన వాయిదా పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్ కేరళలో పర్యటించి వరదల వలన ఎంత నష్టం జరిగింది అని పరిశీలించారు. పలు పార్టీల నాయకులు కేరళ చేరుకుని పునరావాస కేంద్రాలలో ఉంటున్న వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతున్నారు.