కాంగ్రెస్ పగ్గాలు ముళ్లకిరీటమే? తప్పుకోనున్న సోనియా?.. ఖర్గే, శశిథరూర్ ఫ్రంట్రన్నర్లుగా
న్యూఢిల్లీ: దేశానికి కొన్ని దశాబ్దాల పాటు దిశా నిర్దేశం చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రాజకీయయ పార్టీగా గుర్తింపు సాధించింది. సంవత్సరాల తరబడి ప్రధానమంత్రి పదవిని అందుకున్న ఘన చరిత్ర ఉందా పార్టీ.. ప్రస్తుతం నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సారధ్య బాధ్యతలను అందుకోవడానికి గాంధీ కుటుంబం నిరాకరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తదుపరి వారసుడు ఎవరనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Recommended Video
ఓటమి విభాగం నుంచి..
అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్సుకోవడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను అందుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. ఇదివరకే ఓ సారి పార్టీకి నేతృత్వం వహించారు రాహుల్ గాంధీ. ఆయన సారథ్యంలోనే పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది. దాని ఫలితం ఎలా వచ్చిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కంచుకోటగా ఉంటూ వచ్చిన అమేథీ లోక్సభ నియోజకవర్గంలో స్వయంగా రాహుల్ గాంధీ ఓటమిపాలు కావాల్సి వచ్చింది.
ప్రియాంకా గాంధీ సైతం..
చివరి నిమిషంలో కేరళలోని వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేయడం, అక్కడ విజయం సాధించడంతో లోక్సభలో కాలు పెట్టగలిగారు రాహుల్ గాంధీ. ఒకవంక నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అత్యంత బలంగా ఎదిగిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను వహించడం అనేది ముళ్లకిరీటంలాగే భావిస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి తురుఫుముక్కగా భావిస్తూ వచ్చిన ప్రియాంకా గాంధీ సైతం పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిణామాల మధ్య చాలాకాలం తరువాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం మార్గదర్శనం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మల్లికార్జున ఖర్గె.. శశిథరూర్..
కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవరితో భర్తీ చేయాలనే అంశం మీద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కాస్సేపట్లో భేటీ కాబోతోంది. ఈ ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశమౌతుంది. కాంగ్రెస్లోని అత్యున్నత భేటీ ఇది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఎవరున్నారనే పేర్లు బయటికి రావట్లేదు. కేంద్ర మాజీమంత్రులు మల్లికార్జున ఖర్గె, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్ వంటి కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. ఈ లిస్టులో మల్లికార్జున ఖర్గె, శశిథరూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీకి బాధ్యతల అప్పగింత కోసం
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ప్రత్యేకించి- మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ డిమాండ్ చేస్తున్నారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ పగ్గాలను అందుకోవాలని మహారాష్ట్ర కాంగ్రెస్ ఓ తీర్మానం కూడా చేసింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ప్రస్తుత మంత్రి బాలాసాహెబ్ థొర్రాట్ వంటి నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. దీన్ని ఏఐసీసీకి పంపించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ తీర్మానం చర్చకు రాబోతున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సోనియా కోసం కీలక నేతలు..
రాహుల్ గాంధీ ఏ మాత్రం సుముఖంగా లేరనేది స్పష్టమౌతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మరోసారి పార్టీని నేతృత్వాన్ని వహించడానికి ఆసక్తి లేరనేది తేటతెల్లమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వంటి నేతలు సోనియాగాంధీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమే కొనసాగాలని పట్టుబడుతున్నారు. అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ తప్పుకోవడం ఖాయమేనని అంటున్నారు.