రిగ్గింగుతోనే నెహ్రూ ప్రధాని అయ్యారు, షెహజాద్ ప్రశ్నిస్తే నోరు నొక్కేశారు:మోడీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం పలుచోట్ల ఆయన ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బావిలో నీళ్లుంటేనే చేదతో తోడగలమని గుజరాతీలో ఓ సామెత ఉందని, కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇక దేశంలో దానిని ఆ పార్టీ ఎలా పాటిస్తుందని నిలదీశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్, రికార్డ్ సృష్టించిన సోనియా గాంధీ
దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించడానికి ఒకసారి కాంగ్రెస్ సమావేశం నిర్వహించిందని, దానిలో జవహర్లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అయినా రిగ్గింగ్ చేసి నెహ్రూ గెలిచేలా చూశారని, మొరార్జీ దేశాయ్ విషయంలోనూ ఇలాగే అడ్డుకున్నారని, ఎన్నికల్లో రిగ్గింగు చేసే చరిత్ర కాంగ్రెస్కి ఉందని తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన షెహజాద్ పూనావాలా అనే వ్యక్తి అంతర్గత ఎన్నికల గురించి, దానిలో రిగ్గింగ్ పైనా ప్రశ్నిస్తే నోరు నొక్కేశారని మోడీ అన్నారు. సామూహికంగా బహిష్కరించారని చెప్పారు. బయటకేమో ఎప్పుడూ సహనం అని వల్లె వేస్తారని, లోపల మాత్రం ఇలాంటి యువకుడి నోరు కట్టేస్తారన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఫలితమేమిటో ముందే నిర్ణయమైపోయిందన్నారు.