రాందేవ్ బాబాకున్న విద్యార్హతలేంటీ?: హర్యానా సర్కారుని ప్రశ్నించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబాని హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అసలు యోగా, ఆయుర్వేదలో రాందేవ్ బాబాకున్న విద్యా అర్హతలేంటని ప్రశ్నించింది.
రాందేవ్ బాబాను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎలా నియమిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి సంపత్ సింగ్, మనోహార్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాథమిక స్ధాయి విద్య కూడా లేని రాందేవ్ బాబాను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం కుదరదని సింగ్ తేల్చి చెప్పారు.
అంతేకాదు తక్షణమ్ రాందేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్గా తీసివేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు గురుకులాలను ఆచార్యకులాలుగా మర్చడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ప్రాథమిక స్ధాయి విద్య కూడా లేనందున రాందేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం యోగా, ఆయుర్వేదను ప్రాక్టీస్ చేస్తున్న వారు అత్యంత అర్హతను కలిగి ఉండటంతో పాటు డాక్టరేట్ డిగ్రీలను కలిగి ఉన్నారు. ఇక ఆయుర్వేద డాక్టర్లైతే ఎమ్ఎస్, ఎమ్డీ డిగ్రీలను కలిగి ఉన్నారు. రాందేవ్ బాబాను నియమించడం ఒక జోక్ లాగా ఉందన్నారు.
పాఠశాలలో యోగా పాఠాలు చెప్పేందుకు గాను ప్రభుత్వం అర్హతను కలిగి ఉన్న వైద్యులు, శిక్షకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ గత ఏడాది సాధారణ ఎన్నికల్లో రాందేవ్ బాబా బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద, యోగాను ప్రచారం చేస్తోందని సింగ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ రాందేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ రాష్ట్రంచే నడపబటుతున్న పాఠశాల్లో క్రమశిక్షణే ముఖ్య ఉద్దేశ్యంగా యోగాను ప్రవేశపెట్టారు. ఇటీవలే హర్యానా ప్రభుత్వం ఇచ్చిన కేబినెట్ హోదాను రాందేవ్ బాబా సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.